విద్యార్థిదశలో ఎవరైనా రెండోమూడో స్కూల్స్ మారి ఉంటారు. ఒకటే పాఠశాలలో పదోతరగతి వరకు చదివిన వారు కూడా కనిపిస్తారు. కానీ పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్ ఆరు పాఠశాలలు మారిందట. తన తండ్రి సైన్యంలో అధికారిగా పనిచేసేవారు కాబట్టి ప్రతి రెండేళ్లకొకసారి బదిలీలు జరిగేవని, దాంతో భిన్న ప్రదేశాలు, సంస్కృతులతో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పింది రకుల్ప్రీత్సింగ్. ఆమె మాట్లాడుతూ ‘ఎవరైనా ఒకే ప్రాంతంలో పదేళ్ల పాటు నివసించామని, అలాగే ఒకే స్కూల్లో చదివామని చెబితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను అలాంటి లైఫ్ను బోర్గా ఫీలవుతాను. భిన్న ప్రాంతాలతో అనుబంధం ఉంటే చాలా మంది కొత్త మిత్రుల్ని సంపాదించుకోవచ్చు. ఎక్కువ జ్ఞాపకాల్ని ప్రోది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సాంస్కృతికపరంగా కూడా అందరిని అర్థం చేసుకునే వీలుంటుంది. నాకు అలాంటి అదృష్టం దక్కింది. పదోతరగతి పూర్తయ్యేలోపే నేను దాదాపు ఆరుసార్లు స్కూల్మారాను. చిన్న వయసులోనే భిన్న ప్రాంతాలను దర్శించడం వల్ల ప్రపంచం గురించి నూతన దృక్పథం అలవడింది’ అని చెప్పుకొచ్చింది.