ప్రత్యేక ప్రతినిధి, మే 23, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కోవడానికి ‘సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ (సీసీసెంబీ), హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సహకారంతో శంషాబాద్లోని విన్స్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన కరోనా యాంటిబాడీ థెరపీని మనుషులపై ప్రయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది. దీంతో మానవులపై ప్రతిరక్షకాల మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కోసం విన్స్ బయో ప్రొడక్ట్స్ ఏర్పాట్లు చేస్తున్నది. కొన్ని నెలలుగా గుర్రాలు, ఎలుకలపై జరుపుతున్న ‘యాంటి డాట్’ ప్రయోగాలు విజయవంతమయ్యాయని ఆ కంపెనీ ఇటీవలే ప్రకటించింది. మనుషులపై ప్రయోగాలకు అనుమతినివ్వాలని డీసీజీఐని పలుసార్లు కోరింది. దీనిని లోతుగా పరిశీలించిన ఆ సంస్థ మానవులపై పరీక్షలకు అనుమతిచ్చిందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇనాక్టివ్ కరోనా వైరస్ను గుర్రాలకు ఎక్కించి ప్రతిరక్షకాలు ఏవిధంగా ఏర్పడుతున్నాయనే విషయంపై ప్రయోగాలు చేశారు. ఆ గుర్రాల రక్త నమూనాలను సేకరించి శుద్ధిచేసి ఇతర గుర్రాలకు, ఎలుకలు, కుందేళ్లకు ఎక్కించారు. ఈ ప్రయోగం ద్వారా గుర్రాల శరీరంలో కరోనా ప్రతిరక్షకాలు ఏర్పడి మంచి ఫలితాన్నిచ్చాయట. మనుషులపై యాంటిబాడీ థెరపీకి డీసీజీఐ అనుమతించడం కీలక పరిణామమని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా అన్నారు. గుర్రాల ఇమ్యునోగ్లోబిన్పై జరిపిన ప్రయోగాల్లో ప్రతిరక్షకాలు బాగా వృద్ధి చెందాయని వివరించారు.