కొండాపూర్, మార్చి 12 : వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ఇంక్యుబేటర్లోని గ్రస్ అండ్ గ్రేడ్ (జీఅండ్జీ) స్టార్టప్ అభివృద్ధి చేసిన ‘ఉపజ్గురు’ ప్లాట్ఫామ్ను శనివారం ప్రారంభించారు. రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా ఈ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. వర్సిటీలోని ఆస్పైర్ బయోనెస్ట్ ఇంక్యుబేటర్లో ఐఐఎం ఇండోర్, ఐఐఐటీ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పూర్వ విద్యార్థులు ప్రారంభించిన జీఅండ్జీ స్టార్టప్ ఈ ప్లాట్ఫామ్ను రూపొందించడం అభినందనీయమని డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలోని సమస్యల పరిష్కారానికి ఉపజ్గురు ప్లాట్ఫామ్ ఉపకరిస్తుందని తెలిపారు.