హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేగింది. గతంలో కనీవినీ ఎరుగని పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం నిర్వహించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని తెలిసింది. దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రేవంత్ వైఖరిపై నిరసన వ్యక్తంచేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ చూడని ఓటమి ఇదని.. ఇందుకు రేవంతే కారకుడని ఆరోపించినట్టు తెలిసింది. ఒక దశలో రేవంత్ వర్గానికి, సీనియర్లకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరుగటంతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ కల్పించుకొని సర్దిచెప్పారని సమాచారం. రేవంత్ తీరుపై అసహనం వ్యక్తంచేసిన సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ సమావేశం మధ్యలోనే వెళ్లిపోవడం గమనార్హం. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశానికి వచ్చి, తన అభిప్రాయాలను చెప్పేసి వెంటనే బయటకు వచ్చేశారు. రేవంత్ను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమావేశానికి హాజరుకానేలేదు.
పార్టీ భవిష్యత్తును పణంగా పెడతారా?
అభ్యర్థి ఎంపిక మొదలుకొని ప్రచారం, ఎన్నికల నిర్వహణలో రేవంత్రెడ్డి అనుసరించిన విధానంతో పార్టీకి తీరని అన్యాయం జరిగిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘బీజేపీ అభ్యర్థి ఈటల కోసం కాంగ్రెస్ను బలిపెడతారా? ఒక పార్టీని దెబ్బ కొట్టేందుకు సొంత పార్టీ భవిష్యత్ను పణంగా పెడతారా?’ అని నిలదీసినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తాత్కాలింగా దెబ్బ తగలొచ్చు కానీ.. ఈ ఫలితాలు కాంగ్రెస్ భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పలువురు అభిప్రాయపడ్డట్టు సమాచారం.
2023 వరకు పార్టీ కార్యక్రమాలకు దూరం: టీ జగ్గారెడ్డి
హుజూరాబాద్ ఓటమిపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ‘వాస్తవాలు మాట్లాడితే నన్ను వి రోధిగా చిత్రీకరిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నా అలవాటు. నేను మాట్లాడకపోతే పార్టీకే నష్టం తప్ప నాకేమీకాదు. ఇకపై పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడను. 2023 ఎన్నికల వర కు పార్టీ వ్యవహారాలకు, సమావేశాలకు దూరం గా ఉంటా. నా నియోజకవర్గంలో గెలుపు కోసం పని చేసుకొంటా’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం. పార్టీ ఇంచార్జీలు బోసురాజు, మాణిక్కం ఠాగూర్లకు ఇక్కడి వ్యవహారా లు ఏం తెలుసు అని నిలదీశారని తెలిసింది.
ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాం: వీ హనుమంతరావు
హుజూరాబాద్లో బద్ధ శత్రువు బీజేపీ గెలిస్తే, కాంగ్రెస్కు 3 వేల ఓట్లు వచ్చాయని సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఏ మొఖం పెట్టుకొని తిరగాలి? హుజూరాబాద్లో పార్టీకి పక్కాగా ఉన్న 20% ఓటు బ్యాంక్ ఇప్పుడేమైపోయింది? ఆ ఓట్లు ఎటు పోయాయి? ఎవరికి పడ్డాయో తేల్చాలి. ఓటమిపై విచారణ జరిపించాలి’ అని పట్టుబట్టినట్టు సమాచారం.
కాంగ్రెస్కు దీర్ఘకాలిక నష్టం: మధుయాష్కీ
పార్టీకి ఎన్నడూ ఇన్ని తక్కువ ఓట్లు రాలేదని, ఈ ఫలితం పూర్తి నిరాశ కలిగించిందని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారని తెలిసింది. ‘కొందరు క్షణికానందం కోసం బీజేపీకి సపోర్ట్ చేశారు. ఈ రకమైన తీరు కాంగ్రెస్కు భవిష్యత్లో తీరని నష్టం చేస్తుంది. క్యాడర్ పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉన్నది. ఫలితంపై సమీక్షించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో పార్టీ మరింత దిగజారిపోతుంది’ అని హెచ్చరించారని సమాచారం.
వెరీ బ్యాడ్ షో: ఉత్తమ్
హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ది ‘వెరీ బ్యాడ్ షో’ అని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి వ్యా ఖ్యానించినట్టు తెలిసింది. తాను ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి బాధేసిందన్నారని పేర్కొన్నట్టు సమాచారం. అక్కడ పార్టీకి క్యాడర్ ఉన్నా ఉపయోగించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
మాట్లాడనిస్తారా? వెళ్లిపోవాలా?: కే జానారెడ్డి
సమావేశంలో సీనియర్ నేత జానారెడ్డి తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి గురైనట్టు తెలిసింది. ఉప ఎన్నిక ఫలితాలపై జానారెడ్డి మాట్లాడుతుండగా రేవంత్ నిలువరించడంతో.. ‘నేను చెప్పేది చెప్పనిస్తే ఉంటా.. లేదంటే సంతకం పెట్టి వెళ్లిపోతా’ అన్నారని సమాచారం. ఒక దశలో ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రేవంత్ ఆత్మ సమర్ధన ధోరణిలో మాట్లాడే ప్రయత్నం చేయగా జానారెడ్డి తప్పు పట్టినట్టు తెలిసింది. ‘ఈ పార్టీ ఏమైనా నీ సొంత పార్టీనా? నువ్వు ఒక్కడివే బాధ్యుడివి ఎలా అవుతావు? ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుందే తప్ప ఒక్కడి బాధ్యత ఉండదు’ అని చెప్పినట్టు తెలిసింది. అనంతరం జానా ఆగ్రహంతో భేటీ నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది.