సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలోని సీపీఎల్ అంబర్పేట్ హైస్కూల్ ప్రజల ఆదరణ పొందుతున్నది. పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందిస్తున్నది. 2007లో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభించిన ఈ స్కూల్లో చదువుకోవడానికి విద్యార్థులు పోటీ పడుతున్నారు. చుట్టు పక్కల ఉండే కాలనీల నుంచి ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఈ స్కూల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో 690 మంది విద్యార్థులు, 6 నుంచి 10 వరకు దాదాపు 800 వరకు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1 నుంచి 10వ తరగతి వరకు కలిపి 1,490 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో నమోదయ్యారు. పదో తరగతిలోనే 180 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. 26 మంది టీచర్లతోనే ప్రతి సంవత్సరం ఇక్కడి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రతి ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాలలో 85 శాతం వరకు ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఇక్కడి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పూర్తి చేసిన ఎందరో విద్యార్థులు ఎంసెట్లో ర్యాంకులు సాధించారు. అలాగే ఐఐఐటీ బాసరలోనూ అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల నమోదు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండడం విశేషం.
డిజిటల్ ల్యాబ్లు, సైన్స్ ఫెయిర్లు..
14 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సీపీఎల్ అంబర్పేట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో డిజిటల్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు సైన్స్ ఫెయిర్లో మంచి మంచి ప్రదర్శనలు ఇస్తున్నారు. అటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తున్నారు. ప్రభుత్వం అందించే సహకారం వల్లే అంబర్పేట్ స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
మన ఊరు-మనబడి అద్భుతం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ బోధన అందించడం చాలా అద్భుతమైన నిర్ణయం. ఇంగ్లిష్ మీడియం బోధన వల్ల గ్రామీణ, పేద విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు. వారి కుటుంబాలు బాగుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం చదువుల వల్ల పేదరికం నుంచి బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కరోనా పరిస్థితుల్లోనూ ఈ స్కూల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరుగడం చూస్తే.. ఇంగ్లిష్ మీడియం చదువులపై విద్యార్థులకు ఉన్న ప్రేమాభిమానాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇంగ్ల్లిష్ మీడియం.. విప్లవాత్మక నిర్ణయం
విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం విప్లవాత్మకమైన చర్య. ప్రాథమిక, ఉన్నత దశ నుంచే ఇంగ్లిష్ మీడియంలో ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం బోధన అందించడం ఒక శుభారంభం. ఉన్నత చదువులకు, ఉన్నతంగా ఎదగడానికి, ఉన్నత ఉపాధి అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతో దోహదపడుతోంది.
చరిత్రాత్మక నిర్ణయం
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయంతో తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతాయి. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఇంగ్లిష్ విద్యతోనే విద్యార్థుల బతుకులు మారుతాయి. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మన ఊరు-మన బడి పథకాన్ని ప్రారంభించడం చారిత్రక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టడం వలన పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంది.