పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం.. తల్లిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే.. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఇతరత్రా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి. గర్భం రాగానే డాక్టర్ సూచించినట్లుగా ఆహారం, మందులతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకపోతే నెలలు నిండని, బరువు తక్కువ శిశువులు పుట్టే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి బిడ్డలు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
బిడ్డ పుట్టింది మొదలు ఆరు నెలలు నిండేవరకు, తల్లిపాలు తప్పక తాగించాలి. అలాంటి పిల్లల్లో శ్వాస వ్యాధులతోపాటు ఇతర రుగ్మతలు వచ్చే ఆస్కారం తక్కువ. ఒకవేళ వచ్చినా తీవ్రత నామమాత్రంగా ఉంటుంది. త్వరగా కోలుకుంటారు. తల్లిపాలు తాగని పిల్లలు న్యుమోనియా బారినపడే ప్రమాదం ఐదురెట్లు ఎక్కువ.
ఆహార లోపం వల్ల చిన్నారులు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. దానికి న్యుమోనియా కూడా తోడై, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ధోరణి మరీ ఎక్కువ. ఆహార లోపాల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శ్వాసక్రియలో సహకరించే కండరాలు సరిగా పనిచేయవు. దీంతో ఛాతీలో పేరుకొన్న కఫం పూర్తిగా బయటికి రాదు.
పలురకాల బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను టీకాలతో సమర్థంగా నివారించవచ్చు. శ్వాస వ్యవస్థ
వ్యాధులను అడ్డుకునే ముఖ్యమైన టీకాలు..
పిల్లల్లో వచ్చే అనేక అంటువ్యాధుల్లానే శ్వాస వ్యవస్థను ఇబ్బందిపెట్టే వ్యాధులను కూడా చాలా
వరకు నివారించవచ్చు. ముఖ్యంగా, కుటుంబ సభ్యులకు వ్యాధి నివారణ చర్యలపై సరైన అవగాహన ఉండాలి. అప్పుడే, పసిబిడ్డలకు టీకా రక్షణ ఇవ్వవచ్చు. శిశు మరణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చు.
డాక్టర్ కర్రా రమేశ్ రెడ్డి పిల్లల వైద్య నిపుణులు