న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఒమిక్రాన్ దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 15 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 250 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. పాజిటివ్గా తేలిన బాధితులందరి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపిస్తున్నట్టు ఢిల్లీ అధికారులు పేర్కొన్నారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో గుమిగూడటాన్ని నిషేధించారు. డిసెంబర్ 31 వరకు బార్లు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతోనే పనిచేయాలని ఆదేశించారు. జనవరి 1 నుంచి బహిరంగ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు హర్యానా సర్కారు వెల్లడించింది. డిసెంబర్ 30-జనవరి 2 వరకు ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దని కర్ణాటక సర్కారు ఆదేశించింది. క్రిస్మస్, న్యూఇయర్ రోజున ముంబైలో పార్టీలను నిషేధించారు. కరోనాపై గురువారం ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
బ్రిటన్లో విజృంభణ
కరోనా వైరస్తో అల్లకల్లోలమైన బ్రిటన్, అమెరికాలో కొత్త వేరియంట్ ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నది. బ్రిటన్లో బుధవారం ఒక్కరోజే 1,06,122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయి ఉద్ధృతికి ఒమిక్రానే కారణమని వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ వీలైనంత తొందరగా బూస్టర్ డోసు వేసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలో కూడా రోజూవారీ కేసుల సంఖ్య 1.8 లక్షలకు తగ్గట్లేదు. ఒమిక్రాన్ వ్యాప్తితోనే కేసుల సంఖ్య ఈ స్థాయిలో పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఫ్రాన్స్లోనూ కేసులు పెరుగుతుండటంతో పిల్లలకు వ్యాక్సిన్ వేయించడానికి తల్లిదండ్రులు టీకా కేంద్రాలకు పోటెత్తుతున్నారు. స్పెయిన్, జర్మనీ, ఇటలీ, రష్యాలో కూడా కేసుల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తున్నది.
చైనాలో 1.3 కోట్ల మంది ఇంటికే పరిమితం
చైనాలోని జియాన్ నగరంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడంతో అధికారులు లాక్డౌన్ విధించారు. దీంతో దాదాపు 1.3 కోట్ల మంది ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు కరోనా టీకా నాలుగో డోసు వేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది. మూడో డోసు వేసుకొని నాలుగు నెలలు గడిచిన వారికి నాలుగో డోసు వేయనున్నారు.