న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ చేరికతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టాపార్డర్లో మరింత స్థిరత్వం వచ్చిందని ఆ జట్టు హెడ్ కోచ్ సంజ య్ బంగార్ పేర్కొన్నాడు. తాజా వేలంలో బెంగళూరు 37 ఏండ్ల డుప్లెసిస్ను రూ. 7 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఫాఫ్ చేరికతో జట్టు నాయకత్వ నైపుణ్యం కూడా పెరుగనుందని బంగార్ అన్నాడు. ‘సఫారీ స్టార్ రాకతో బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. అత్యున్నత స్థాయిలో డుప్లెసిస్ ప్రదర్శన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టాపార్డర్లో స్థిరత్వం తెచ్చే ఆటగాడి కోసం వెతికాం. ఫాఫ్ను ఎంపిక చేసుకోవడంతో ఓపెనింగ్ సమస్య తీరడంతో పాటు నాయకత్వ నైపుణ్యం కూడా పెరుగుతుంది. వేలంలో నాణ్యమైన ఆటగాళ్లను చేజిక్కించుకున్నందుకు సంతృప్తిగా ఉన్నాం. జోస్ హజిల్వుడ్తో బౌలింగ్ విభాగం మరింత పటిష్టమైంది’అని బంగార్ వివరించాడు.