హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పర్యావరణ, ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ దవాఖానల నుంచి వెలువడే వ్యర్థజలాలను (ద్రవ వ్యర్థాలను) శుద్ధి చేసేందుకు ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి) ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. దవాఖానల్లో వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను, వ్యర్థజలాలను ‘బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016’కు అనుగుణంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 20 దవాఖానల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణకు రూ. 68.31 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం పాలనాపరమైన ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో రూ. 52.59 కోట్లు ప్లాంట్ల ఏర్పాటుకు, మరో రూ.15.72 కోట్లు మూడేండ్లపాటు ప్లాంట్ల నిర్వహణకు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. గాంధీ, ఉస్మానియా, టిమ్స్, నిలోఫర్ దవాఖానలతోపాటు మహబూబ్నగర్, సూర్యాపేట, నల్లగొండ, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లా దవాఖనలు, ఆదిలాబాద్ రిమ్స్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు