agra mother | పిల్లల మంకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ! ఒకసారి ఒకటి కావాలని అంటే అది ఇచ్చేదాకా మంకుపట్టు పడతారు. కావాల్సింది దొరికే దాకా ఏడుపు లంకించుకుంటారు. ఇలాగే పోయిన సైకిల్ కోసం ఓ పిల్లాడు మొండిపట్టు పట్టి ఏడుస్తూ ఉంటే ఓ తల్లి తట్టుకోలేకపోయింది. కొడుకు పోగొట్టుకున్న సైకిల్ను వెతికి పట్టుకునేందుకు గూఢచారిగా మారింది. గల్లీ గల్లీ తిరుగుతూ పోలీసుల తరహాలో చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి దొంగలు ఎత్తుకెళ్లిన సైకిల్ను దొరకపట్టింది. కొడుకు కండ్లలో ఆనందం చూసి మురిసిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన రాహుల్ అగర్వాల్ అనే వ్యాపారి భార్య సోనల్ అగర్వాల్, ఏడేళ్ల కొడుకు అద్విక్తో కమలా నగర్లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం రాహుల్.. తన కుమారుడికి ఒక సైకిల్ను కొనిచ్చాడు. తండ్రి కొనిచ్చిన సైకిల్ను అద్విక్ ఎంతగానో ఇష్టపడ్డాడు. బయటకు ఎటు వెళ్లినా ఆ సైకిల్పైనే వెళ్లేవాడు. అలాగే మంగళవారం ఆడుకునేందుకు సమీపంలోని పార్క్కు సైకిల్పై వెళ్లాడు. పార్కు బయట సైకిల్ను ఉంచి పార్క్ లోపల కొంచెంసేపు ఆడుకుని తిరిగొచ్చాడు. బయటకు వచ్చిన ఆ పిల్లాడికి షాక్. పార్క్ చేసిన అతని సైకిల్ కనబడలేదు. దీంతో చుట్టుపక్కల మొత్తం వెతికాడు. ఎక్కడా సైకిల్ కనిపించకపోవడంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లాడు. జరిగిన విషయం వాళ్ల అమ్మ సోనల్కు చెప్పాడు. పిల్లాడి బాధ చూసిన సోనల్.. పోనీలే.. డాడీకి చెప్పి కొత్త సైకిల్ కొనిస్తా అని నచ్చజెప్పింది. కానీ ఆ పిల్లాడు వినిపించుకోలేదు. నాకు నా సైకిలే కావాలి అంటూ మంకుపట్టు పట్టాడు. తన సైకిల్ దొరికే దాకా అన్నం తినను అని తెగేసి చెప్పాడు. సైకిల్ కోసం అలాగే ఏడుస్తూ కూర్చున్నాడు. ఏడుస్తూ.. దిగాలుగా ఉన్న కొడుకును చూసి.. ఆ బాబు తల్లి సోనల్ తట్టుకోలేకపోయింది. తన కొడుకు మళ్లీ నవ్వుతూ కనిపించాలంటే.. పోయిన సైకిల్ దొరకడమే మార్గం అనుకుంది. ఇందుకోసం ఆమెనే స్వయంగా రంగంలోకి దిగింది. పోలీసుల తరహాలో విచారణ మొదలుపెట్టింది.
ముందుగా పార్క్ దగ్గరకు వెళ్లిన సోనల్.. ఆ ఏరియాలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో గమనించింది. సైకిల్ పోయిన సమయంలోని సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించింది. అప్పుడే ఆమెకు ఒక ఆధారం దొరికింది. టీనేజీ పిల్లాడితో కలిసి స్కూల్ యూనిఫాంలో ఉన్న పిల్లాడు సైకిల్ను తీసుకెళ్లడం ఆ వీడియోలో రికార్డు అయింది. దీంతో ఆ వీడియోను తన మొబైల్లో కాపీ చేసుకుని.. సైకిల్ ఎత్తుకెళ్లిన పిల్లల కోసం వెతకడం మొదలుపెట్టింది సోనల్. తన మొబైల్లో కాపీ చేసుకున్న వీడియోను.. ఆ ఏరియాలో అందరికీ చూపిస్తూ వాళ్ల ఆచూకీ గురించి అడుగుతూ వెళ్లింది. చివరకు ఆ పిల్లలు బల్కేశ్వర్ కాలనీలో ఉంటారని తెలుసుకుంది. వాళ్లను వెతికి పట్టుకుంది. ఆ తర్వాత సైకిల్ ఏం చేశారని పిల్లలిద్దరినీ సోనల్ నిలదీసింది. భయపడిపోయిన పిల్లలు నోరువిప్పారు. 250 రూపాయలకు ఓ తుక్కు సామాను కొనే వ్యక్తికి అమ్మేసినట్లు చెప్పారు. దీంతో ఆ పిల్లలను తీసుకుని సోనల్.. తుక్కు వ్యాపారి వద్దకు వెళ్లింది. ఆ ఇద్దరు పిల్లలు అమ్మిన సైకిల్ ఇవ్వమని అడిగింది. కానీ ఆ తుక్కు వ్యాపారి బుకాయించాడు. ఆ పిల్లలు ఎవరో తెలియదని.. తన దగ్గర ఏ సైకిల్ లేదంటూ దాటేసే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు సీన్లోకి రావడంతో ఆ తుక్కు వ్యాపారి నిజం ఒప్పుకున్నాడు. తన దగ్గర పెట్టుకున్న సైకిల్ను తిరిగిచ్చేశాడు. ఎట్టకేలకు సైకిల్ను దొరకబట్టి తన కొడుక్కి ఇచ్చింది. పోయిన సైకిల్ దొరకడంతో పిల్లాడి కండ్లలో కనిపించిన ఆనందం చూసి తెగ మురిసిపోయింది. ఆ తర్వాత అదే సైకిల్పై ఎక్కి తన తల్లితో కలిసి ఆ బుడ్డోడు ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొడుకు కోసం ఆ తల్లి చేసిన సాహసాన్ని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
Jio Laptop | చౌకధరలో జియో న్యూ ల్యాప్టాప్.. స్పెషిపికేషన్స్ ఇవే..!
అమ్మాయిని కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టిన అమ్మానాన్న.. అసలు నిజం తెలిసి షాక్!