నటిగా తనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, తనకన్నీ తెలిశాయని అనుకోనని చెబుతున్నది బాలీవుడ్ అందాల భామ ఆలియా భట్. ఇటీవలే ‘గంగూభాయ్ కథియావాడి’తో వందకోట్ల రూపాయల వసూళ్ల క్లబ్లో చేరిందీ తార. నాయిక ప్రధాన చిత్రంతో ఇంత భారీ విజయాన్ని సాధించినా అవేమీ తనను ప్రభావితం చేయవని అంటున్నది. ఆలియా మాట్లాడుతూ…‘పదేళ్ల క్రితం నటిగా అరంగేట్రం చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానని భావిస్తుంటా. నేను నాయికగా అన్నీ తెలుసుకున్నా అనుకోవడం లేదు. జయాపజయాలు ఏది ఎదురైనా ప్రయాణం ఆపకూడదని తెలుసుకున్నా. ఈ ప్రయాణంలో మంచి మిత్రులను పొందేందుకు ప్రయత్నిస్తుంటా. కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం ఉండటం నా అదృష్టం’ అని చెప్పింది. ఆమె నటిస్తున్న రెండు భారీ చిత్రాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఈనెల 25న విడుదలవుతుండగా..‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న తెరపైకి రానుంది.