న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీ ఏదైనా పతకం పక్కా రీతిలో చెలరేగుతూ ఇషా అదరగొడుతున్నది. మెగాటోర్నీలో ఇప్పటికే మిక్స్డ్ విభాగంలో పసిడి పతకం కొల్లగొట్టిన ఇషా..మళ్లీ మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంటులో ఇషాసింగ్, మను భాకర్, పాలక్తో కూడిన భారత త్రయం 16-8 తేడాతో జార్జియాపై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచి తమదైన జోరు కనబరిచిన భారత జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత త్రయం రుద్రాంక్ష్ పాటిల్, పార్థ్ మకిజా, ఉమామహేశ్ మద్దినేని 16-8తో స్పెయిన్పై గెలిచి పసిడి సొంతం చేసుకుంది. మహిళల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఆర్య బోర్సె, జీనాకిట్టా, రమిత త్రయం 17-9తో కొరియాపై గెలిచి పసిడి కైవసం చేసుకుంది. పురుషుల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సౌరభ్ చౌదరి, శివ నార్వల్, సరభ్జితసింగ్ 17-9తో ఉజ్బెకిస్థాన్పై గెలిచి భారత్కు మరో స్వర్ణాన్ని అందించింది. మొత్తంగా టోర్నీలో భారత్ 8 స్వర్ణాలు, 6 రజతాలతో టాప్లో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా(3), ఫ్రాన్స్(4) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.