కోహిమా: నాగాలాండ్ కూలీలపై సైన్యం కాల్పుల ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. కాల్పులకు ముందు వాహనంలో ఉన్నది పౌరులా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించే ఎలాంటి ప్రయత్నాలను సైన్యం చేయలేదని డీజీపీ టీ జాన్ లాంగ్కుమార్, కమిషనర్ రోవిలౌత్ మోర్ తమ సంయుక్త నివేదికలో పేర్కొన్నారు. తొలుత సైన్యం జరిపిన కాల్పుల్లో ఆరుగురు కూలీలు మరణించారని, వారి మృతదేహాలను గ్రామస్థులకు కనిపించకుండా బేస్ క్యాంపునకు తరలించేందుకు సైనికులు ప్రయత్నించారన్నారు. కాల్పుల ఘటనపై మేజర్ జనరల్ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఎంక్వైరీకి ఆదేశించినట్టు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కూలీల మరణాల నేపథ్యంలో గిరిజనుల సంప్రదాయ ఉత్సవం హార్న్బిల్ ఫెస్టివల్ను నాగాలాండ్ క్యాబినెట్ రద్దు చేసింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది.