హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): తమిళనాడు బీసీ కమిషన్ బృందంతో చెన్నైలో తెలంగాణ బీసీ కమిషన్ బృందం బుధవారం భేటీ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి తీసుకోవాల్సిన కొలమానాలు, పాటించాల్సిన విధివిధానాలపై చర్చించింది. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు సారథ్యంలో సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పటేల్, కిశోర్గౌడ్ బృందం తమిళనాడు బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ తునికాచలం బృందంతో ప్రత్యేకంగా సమావేశమైంది.
సత్యనాథన్, అంబాశంకర్, జనార్దనం కమిషన్ నివేదికలపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా రిజర్వేషన్ల నిర్ణయానికి సంబంధించి మెథడాలజీ, న్యాయపరమైన అంశాలపై సమాలోచనలు జరిపారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఉత్పన్నమైన అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లోని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నేపథ్యంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఈ అధ్యయనం చేపట్టింది.