కోల్సిటీ, సెప్టెంబర్ 3: ఆపదలో ఉన్న కుటుంబానికి గోదావరిఖనికి చెందిన గీత పారిశ్రామిక సహకార సంఘం అండగా నిలిచింది. ప్రమాదంలో గాయపడి అచేతన స్థితిలో ఉన్న తోటి సభ్యుడికి రూ. లక్ష సాయం చేసి మానవత్వాన్ని చాటింది. గీత పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యుడు రంగు శ్రీనివాస్ ఏడాది కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతన స్థితికి చేరాడు. అతడి భార్య రంగు చంద్రకళకు కూడా క్యాన్సర్ వ్యాధి ప్రబలడంతో ప్రస్తుతం చికిత్స చేయిస్తున్నారు.
అటు భర్త నడవలేని స్థితి… ఇటు భార్య ప్రాణపాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న స్థానిక గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తలా కొంత పోగు చేసుకొన్నారు, శనివారం లక్ష రూపాయలను సిద్ధిపేటలో ఉంటున్న భార్యాభర్తలకు అక్కడి మున్సిపల్ చైర్మన్ రాజనర్సు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బెందె నాగభూషణం, చిన్న యాదగిరి, మడ్డి శ్రీనివాస్, బండి సురేశ్, కదిరి సురేశ్, జనార్దన్, దుద్దెడ రమేశ్ గౌడ్ తదితరులున్నారు