ఈ ఏడాది ‘వకీల్సాబ్’ చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది చెన్నై సోయగం శృతిహాసన్. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీ భాషల్లో చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ తెలుగులో బాలకృష్ణ సరసన నాయికగా ఖరారైంది. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.
యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. భారీ నిర్మాణ విలువలతో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించనుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శృతిహాసన్ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సుందరి తొలిసారి బాలకృష్ణతో జోడీకట్టబోతుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సంగీతం: తమన్, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.