శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటిస్తున్న చిత్రం ‘భళా తందనాన’.చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. మే 6న ఈ సినిమా విడుదలవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, శేఖర్ కమ్ముల అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ…‘శ్రీవిష్ణు ఇరుగు పొరుగు కుర్రాడిలా ఉంటాడు. ఏ పాత్రలోకైనా సులువుగా మారిపోతాడు. కథల ఎంపికలో జాగ్రత్తపడుతూ తనకో ప్రత్యేకత తెచ్చుకున్నాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది. దర్శకుడు చైతన్య దంతులూరి సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తున్నది. ప్రతి సీన్లోనూ తర్వాత ఏ జరుగుతుందో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ క్యాథరీన్ క్యారెక్టర్ బాగుంది’ అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…‘శ్రీవిష్ణు నా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నటించాడు. అప్పుడే నన్ను చాలా ప్రశ్నలు అడిగేవాడు. పాత్రకు సరిగ్గా సిద్ధపడేవాడు. నటనమీద అంత ఇష్టం చూపిస్తాడు. చైతన్య ‘బాణం’ సినిమా నాకు నచ్చింది. మంచి కథలు, కంటెంట్ చూపిస్తాడు. ఇకపై మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘రాజమౌళి, శేఖర్ కమ్ముల నాకు ఇష్టమైన దర్శకులు. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రతిభ వారి సొంతం. వాళ్లిద్దరూ మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని నటీనటులంతా ఇంతకముందు ఎవరూ చేయని పాత్రలు ఇందులో పోషించారు. నాకూ, కేథరీన్కు కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి కొర్రపాటి, దర్శకుడు చైతన్య దంతులూరి, రచయిత శ్రీకాంత్ విస్సా, నటుడు గరుడ రామ్ తదితరులు పాల్గొన్నారు.