నటిగా అవార్డులు పొందడం కంటే గొప్ప సినిమాలో భాగమవ్వాలని తను కోరుకుంటున్నానని చెబుతున్నది కన్నడ తార శ్రీనిధి శెట్టి. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ భామ..‘కేజీఎఫ్’ రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. రీనా దేశాయ్ క్యారెక్టర్లో ఆకట్టుకుంది. అరంగేట్రంలోనే ఇంత భారీ సక్సెస్ అందుకున్న శ్రీనిధికి పలు చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమె విక్రమ్ సరసన ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నది. శ్రీనిధి మాట్లాడుతూ..‘నటిగా నాకు పేరు రావడం కంటే పేరొచ్చే సినిమాలో భాగమవడమే ఇష్టం. మంచి సినిమాలో నటిస్తే సహజంగానే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నటిగా భాషా హద్దులు పెట్టుకోవడం లేదు. ఏ చిత్ర పరిశ్రమలో అవకాశాలు వచ్చినా నటించేందుకు సిద్ధం. నా అభిమాన హీరోల జాబితా కూడా పెద్దదే. నేను కలిసి నటించాలని కోరుకుంటున్న స్టార్స్లో బాలీవుడ్ సహా ప్రతి ఇండస్ట్రీలో నలుగురైదుగురు ఉన్నారు’అని చెప్పింది.