ఖమ్మం, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి క్షేత్రం ముస్తాబైంది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అర్చకులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టాల నుంచే కాక పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరానున్నారు. అందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు.
వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయ సన్నిధిలో ఎదుర్కోలు మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ఆభరణాలతో అలంకరించి, మిథిలా ప్రాంగణానికి ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. కొందరు అర్చకులు రామయ్య తరపున, మరికొందరు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించారు. రామయ్య గుణగణాలు, సీతమ్మ అందచందాలను వర్ణించారు. ఈ వేడుకలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ కనకయ్య, ఎమ్మెల్యే వీరయ్య, ఈవో శివాజీ తదితరులు పాల్గొన్నారు.