హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ ఇప్పుడు మన శరీరంలో ఓ అవయవంలా మారిపోయింది. చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయామన్న భావన చాలా మందిలో కలుగుతున్నది. జనం అంతలా సెల్ఫోన్కు బానిసలుగా మారిపోయారు. ప్రస్తుతం మన దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్లు రోజూ సగటున 4.36 గంటలపాటు యాప్స్పై కాలం గడుపుతున్నారని, లాక్డౌన్తో ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిందని డాటా అనలిటకల్ సంస్థ ‘యాప్ అన్నె’ స్పష్టం చేసింది. 2019 ప్రారంభంతో పోల్చితే ఈ ఏడాది జూన్ నాటికి యాప్స్ వినియోగం 80% పెరిగినట్టు వెల్లడించింది. 2019లో 3.18 గంటలుగా ఉన్న వార్షిక వినియోగ సగటు.. 2020లో 3.48 గంటలకు, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 4 గంటలకు చేరుకున్నట్టు వివరించింది.
రానున్న 3 నెలల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం, యాప్స్ వాడకం మరింత పెరుగుతుందని తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో జరిగే యాప్స్ వినియోగంపై ఈ సంస్థ ఓ అంచనా నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. యాప్స్తో అత్యధిక సమయాన్ని గడిపే దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జులై-సెప్టెంబర్) చివరినాటికి మూడో స్థానంలో ఉన్న భారత్ను చివరి త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో దక్షిణ కొరియా అధిగమించనున్నది. మన దేశంలో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎంఎక్స్ ప్లేయర్, టకాటక్, జెరోధా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్పై ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చివరి త్రైమాసికంలో యాప్ డౌన్లోడ్స్ సంఖ్య 3,600 కోట్లుగా నమోదవుతుందని, వీటి కోసం చేసే ఖర్చు రూ.26 వేలకోట్ల (34 బిలియన్ డాలర్ల) వరకు ఉండొచ్చని అంచనా వేసింది.
ఇండోనేషియా – 5.30 గంటలు(సగటు సమయం)
బ్రెజిల్ – 5.24 గంటలు(సగటు సమయం)
దక్షిణ కొరియా – 5 గంటలు(సగటు సమయం)
భారత్ – 4.48 గంటలు(సగటు సమయం)
రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్): 4 గంటలు
మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్): 4.36 గంటలు
చివరి త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) అంచనా: 4.48 గంటలు