ఆధ్యాత్మిక, పౌరాణిక,
చారిత్రక ధారావాహిక45
జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. అంతలోనే యాదరుషి పాత్ర ప్రవేశిస్తుంది. యాదర్షి తపస్సు, నారసింహావతార రహస్యం గురించి త్రిభువన మల్లుడికి వివరిస్తాడు విజ్ఞానేశ్వరుడు .
త్రిభువనమల్ల చక్రవర్తి, మహారాణి చంద్రలేఖ సపరివారంగా నదీతీరంలో ప్రశాంతమైన వాతావరణంలో విజ్ఞానేశ్వరుడి దివ్య ప్రవచనాన్ని వింటున్న సమయంలో..
ఆశ్వికదళం.. వేగంగా ఆ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న ధ్వని.. గుర్రపు డెక్కల చప్పుడు నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ వినిపిస్తున్నది.
అందరికన్నా ముందుగా జాగరూకుడై నిలిచాడు చక్రవర్తి అంగరక్షక దళాధిపతి.
ఆశ్వికదళానికి ఎదురు పరుగెత్తాడు.. చేతిలో కత్తిని ఎత్తిపట్టుకొని దూకుడుగా.
అయితే, ఆ ఆశ్వికదళ నాయకుడు.. చక్రవర్తి ప్రధాన అంగ
రక్షక దళాధిపతిని చూస్తూనే కూర్చున్న గుర్రం మీదినుంచి ఒక్క అంగలో కిందికి జారి అభివాదం చేశాడు.
“జయము జయము.. త్రిభువనమల్ల సమ్రాట్టుకు..
జయము జయము.. భువనగిరి సామ్రాజ్య కేతనానికి..”
ఆ మాటలు వింటూనే అడిగాడు త్రిభువనుడు.
“ఎవరది? జయభద్రుడా!”..
ఆ మాట వినగానే, ఆ ఆశ్వికుడు తన ముఖాన్ని కప్పేసిన
శిరస్ర్తాణాన్ని తీసి, ప్రభువుల వారికి సాష్టాంగ పడ్డాడు.
విజ్ఞానేశ్వరుడు విస్తుపోయి చూశాడు.
“భద్రుడా.. మేమసలు గుర్తించనే లేదు” అంటూ అంగరక్షక దళాధిపతి.. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీలుస్తూ పక్కకు జరిగాడు.
“ప్రభువులవారికి జయము.. భువనగిరి రాజ్యలక్ష్మీ దేవికి జయము” అంటూ భద్రుడు లేచి అందరికీ సవినయంగా
నమస్కరించాడు.
త్రిభువనమల్లుడికి ముందు ఏమీ అర్థం కాలేదు.
“ఏం జరిగింది భద్రా?” అని అడిగాడు.
“ప్రభూ! మన్నించాలి. మీ విధేయులమైన మేము, భువనగిరి సామ్రాజ్యానికి విశ్వాసపాత్రులమైన మేము.. ఎప్పటికీ జయజయ ధ్వానాలే పలుకుతాము. జయాన్ని మాత్రమే కోరుతాము. కానీ..” అంటూ అర్ధోక్తిలో ఆగాడు భ్రదుడు.
“కానీ.. ఏం జరిగింది?”.
ప్రభువుల వారి ప్రశ్నకు సమాధానం చెప్పబోయి.. ఒక్క క్షణం తటపటాయించాడు.
“ప్రభూ! మీకు మాత్రమే విన్నవించవలసిన ముఖ్యమైన సమాచారం..” సంశయిస్తూనే అన్నాడు.
అర్థమైంది.. అక్కడున్నవారికి.
మరుక్షణంలో ప్రభువుల వారినీ, మహారాణినీ, విజ్ఞానేశ్వర పండితుడినీ వదిలేసి, అందరూ వారి మాటలు వినబడనంత దూరం జరిగిపోయారు.
అక్కణ్నుంచి వెళ్లబోతున్న విజ్ఞానేశ్వరుడిని వారించి, ఇక్కడే ఉండమన్నట్టుగా సైగ చేశాడు త్రిభువనమల్లుడు.
దీంతో అక్కడే ఆగిపోయాడు విజ్ఞానేశ్వరుడు.
“ఇప్పుడు చెప్పు.. ఏమిటి? ఆ ముఖ్యమైన సమాచారం!”.
“చెప్పు భద్రా! ప్రభువుల వారు అడుగుతున్నారు. జయము జయము అంటూనే ఉన్నావు. మరి ఆ సమాచారం ఏమిటో చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావు..” విజ్ఞానేశ్వరుడు అనునయంగా అన్నాడు.
“ప్రభూ! ఒక చేదువార్త. మీకు చేరవేయడానికి అనంతపాల సేనాని నన్ను ఇక్కడికి పంపారు” చెప్పలేక చెప్పాడు.
చిరునవ్వు విరిసింది త్రిభువనుడి వదనంలో..
అది చూసి ఆశ్చర్యపోయింది చంద్రలేఖ.
“ప్రభూ! చేదువార్త అని భద్రుడు చెబుతున్నాడు. అది విని మీ వదనంలో ఆందోళన కనిపించాలి కానీ, మందహాసం ఎందుకోసం?” విస్మయంగా అడిగింది చంద్రలేఖ.
“మహారాణీ.. చంద్రలేఖా దేవీ! మనకు జయము జయము అని పలకడం అతడు నిర్వర్తిస్తున్న విధి.. కానీ, విధి బహుశా మరొక విధంగా
విరచిస్తున్నదేమో!”.
“అంటే?”.
“జయజయ ధ్వానాలు మనం పలుకగలము. కానీ, నిజమైన జయం, అపజయం.. అనేవి కోరుకొంటే వచ్చేవి కావు. వద్దునుకొంటే ఆగేవీ కావు.. భద్రా! భయం లేదు. ఎటువంటి వార్త అయినా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అన్నాడు త్రిభువనుడు.
“ప్రభూ! శత్రువు విష్ణువర్ధనుడు మన పొలిమేర దాకా వచ్చాడు. సరిహద్దు రక్షణ దుర్గాన్ని ధ్వంసం చేశాడు. అపరిమితమైన సైన్యంతో విజయోత్సాహంతో ఉన్నాడు..” తల వంచుకొని నివేదించాడు భద్రుడు.
“మరి, అరివీర భయంకరుడు, యుద్ధ నిపుణుడు, ప్రత్యర్థుల గుండెల్లో నిద్ర పోయేవాడు, మా విశ్వాసపాత్రుడు, సర్వ సైన్యాధికారి.. అనంతపాల మహా సేనాని ఎక్కడ?
ఏం చేస్తున్నాడు?”.
అప్పటిదాకా భక్తిభావం తొణికిసలాడిన ప్రభువుల స్వరంలో కాఠిన్యం ప్రవేశించింది.
“అనంతపాల సేనాని.. విష్ణువర్ధనుడి సైనిక బలగాలను సరిహద్దులో నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ, సఫలం కాలేదు. ప్రస్తుతం తన దగ్గరున్న సైన్యంతో పోరాడుతూనే ఉన్నారు”.
“ఓహో.. మరి పోరాడుతున్న మా మహాసేనాని నీతో పంపిన వర్తమానం ఏమిటి? సహాయం కోసం అధిక సైన్యాన్ని పంపించమనా? లేక ఉన్న శక్తి సరిపోక, మమ్మల్నే యుద్ధరంగానికి రమ్మనా?” తీవ్రంగానే ప్రశ్నించాడు త్రిభువనుడు.
ఈ స్పందన ఊహించని భద్రుడు, భయభ్రాంతులకు లోనై, ఏ సమాధానమూ చెప్పలేక ఆగిపోయాడు.
చంద్రలేఖకు ఈ సమాచారం కోపం
తెప్పించింది.
“ప్రభూ! అనంతపాల సేనానిది అసమర్థత కాదు, అలక్ష్యం. మీరు నరసింహ స్వామివారి అన్వేషణలో ఉన్నప్పుడు, భువనగిరి సామ్రాజ్యంపైన విష్ణువర్ధనుడు యుద్ధం ప్రకటించబోతున్నాడని ముందే తెలిసింది. అప్పుడే మేము అప్రమత్తమయ్యాం. మీ పరోక్షంలో మీ పక్షాన యుద్ధ సన్నాహాల సమావేశం కూడా ఏర్పాటుచేశాం. అసలు యుద్ధరంగానికి నేనే వెళ్దామనుకొన్నాను. మీరు శక్తిమంతుడు, విశ్వాస
పాత్రుడు అని నమ్మిన ఈ అనంతపాల సేనానే అడ్డుపడ్డాడు. నేను స్త్రీని కనుక యుద్ధం చేయలేనని.. రక్తపాతం చూడలేనని భావించాడు. ఆ తరువాత మీరు కోటకు తిరిగొచ్చారు. ‘మనం గెలిచాం’ అన్నమాట వింటామని ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ, ఈ విధంగా జరుగుతుందని నేను ఊహించలేదు. అన్ని శక్తియుక్తులూ ఉండీ, అచేతనంగా ఉండిపోవడం చేతకానివారు చేసే పని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సమ్మతం కాదు. రాజ్యానికి క్షేమకరం కూడా కాదు”.
ఆగ్రహంతో చంద్రలేఖ అన్న మాటలు విని ఆలోచించాడు త్రిభువనుడు. నిజమే..
చంద్రలేఖ చెప్పింది వాస్తవం కావచ్చు.
కానీ, ఇది అనంతపాలుడు అనుకొని చేసింది కాదు.
“ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. అపజయం ఎదురవుతుందని ఊహిస్తే.. ఎవరూ యుద్ధరంగానికి వెళ్లరు. అనంతపాలుడు శక్తిమంతుడే కావచ్చు. విపక్షం ముందు అతని శక్తి సరిపోకపోవచ్చు. గెలిచినప్పుడు అతడు గొప్ప శక్తిమంతుడనీ, ఓడిపోతే.. చేతకానివాడనీ మనం అనకూడదు. అతని పోరాటంలో నిజాయతీ చూడాలి. నిబద్ధత గమనించాలి”.
“ప్రభువులవారి మాటలకు అడ్డొస్తున్నందుకు మన్నించండి. ఇప్పడు మనం ఆలోచించవలసింది సానుభూతి గురించి కాదు. ఓడిన చోట ఎలా గెలవాలి? అని. అతనికి నిజాయతీ లేదని నేననడం లేదు. కానీ, నిజమైన శక్తిని అంచనా వేసుకొనే శక్తి లేదు. ఓటమి ఒక గాయం ప్రభూ! అది లెక్క తప్పినా, గురి తప్పినా.. నిజాయతీ – నిబద్ధతా తప్పినా!”.
చంద్రలేఖలో ఆవేశం చూసి విజ్ఞానేశ్వరుడే విస్తుపోయాడు.
“అయితే, ఇంతకూ అనంతపాల సేనాని చెప్పి పంపిన వార్త ఏమిటి?” రెట్టించి అడిగాడు త్రిభువనుడు.
“ప్రభూ! మనం ఇంకా ఓడిపోలేదు..” చెప్పబోయాడు భద్రుడు.
“కానీ, ఓడిపోతున్న క్రమంలో ఉన్నాం.. అంతేగా!” అన్నది మహారాణి.
“భద్రా.. విషయమేమిటో చెప్పు!”.
“ప్రభూ! మనం గెలిచే పరిస్థితి లేదని మహా
సేనాని వారు తమరికి మనవి చేయమన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రభువుల వారే స్వయంగా సారథ్యం వహించి వచ్చినా ఉపయోగం ఉండదని మీకు తెలియజేయమన్నారు. ఇది మీకు చేరవేయడానికి రావడం, నాకు అవమానంగా ఉంది. యుద్ధభూమిలో ఒరిగిపోయినా.. శాంతి లభించేది!”.
చెప్పడం పూర్తి చేసి తలవంచుకొని నిలబడ్డాడు భద్రుడు.
‘చూశారా.. ఇదీ విషయం’ అన్నట్టుగా మహారాణి భర్తను చూసింది.
ఈ అపజయ భావనను ఆమె సహించలేక పోతున్నదని త్రిభువనుడికి అర్థమైంది.
“అది సరేనయ్యా.. అనంతపాలుడి మాటలకు అర్థమేమిటి? తాను ఓడిపోయాడు సరే.. ‘నేను’ ఓడిపోతానని మా గురించి ఎలా అంచనా వేశాడు? మేమే స్వయంగా వస్తే గెలిచే అవకాశం లేదని ఎలా అనుకొన్నాడు?” కోపంగా అడిగాడు ప్రభువు.
భద్రుడు తనలో తానే మధనపడ్డాడు.
చివరికి ధైర్యం చేసి చెప్పాడు.
“ప్రభూ! విష్ణువర్ధనుడి సైనిక శక్తి మన అంచనాలకు మించి ఉంది.
ఈ వార్త మీకు చేరవేసే సమయానికే మన శత్రువు భువనగిరి కోటను ముట్టడించ వచ్చని హెచ్చరించారు.. అనంతపాల సేనాని”.
ఆ మాటలు విని విజ్ఞానేశ్వరుడు అన్నాడు..
“ప్రభూ! మనం త్వరపడి మన సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి. ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం!”.
“మహానుభావా.. విజ్ఞానేశ్వర పండితోత్తమా.. నరసింహుణ్ని నమ్మినవారికి ఓటమి అనేదే లేదని అన్నావు కదా! శత్రువులు కన్నెత్తి కూడా చూడలేరని చెప్పావుగా! మరి ఇదేమిటి?” మహారాణి తీవ్ర స్వరంతో ప్రశ్నించింది.
“అనంతపాల సేనాని.. విష్ణువర్ధనుడి సైనిక బలగాలను సరిహద్దులో నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ, సఫలం కాలేదు. ప్రస్తుతం తన దగ్గరున్న సైన్యంతో పోరాడుతూనే ఉన్నారు”.
“ఓహో.. మరి పోరాడుతున్న మా మహాసేనాని నీతో పంపిన
వర్తమానం ఏమిటి? సహాయం కోసం అధిక సైన్యాన్ని పంపించమనా? లేక ఉన్న శక్తి సరిపోక, మమ్మల్నే యుద్ధరంగానికి రమ్మనా?” తీవ్రంగానే ప్రశ్నించాడు త్రిభువనుడు.
ఈ స్పందన ఊహించని భద్రుడు, భయభ్రాంతులకు లోనై,
ఏ సమాధానమూ చెప్పలేక ఆగిపోయాడు. చంద్రలేఖకు ఈ
సమాచారం కోపం తెప్పించింది. “ప్రభూ! అనంతపాల సేనానిది
అసమర్థత కాదు, అలక్ష్యం. మీరు స్వామివారి అన్వేషణలో ఉన్నప్పుడు, భువనగిరి సామ్రాజ్యంపైన విష్ణువర్ధనుడు యుద్ధం ప్రకటించబోతున్నాడని ముందే తెలిసింది”- ఆ మాటలు త్రిభువనుడిని ఆలోచింపజేశాయి.
అల్లాణి శ్రీధర్