వ్యవసాయ యూనివర్సిటీ, ఏప్రిల్ 22: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన అగ్రిటెక్ మేళాకు విశేష స్పందన లభించింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన ఈ మేళా శుక్రవారం సాయంత్రం దిగ్విజయంగా ముగిసింది. ఈ మేళాలో వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలతోపాటు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించేందుకు రైతులు భారీగా తరలి వచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారు బుక్ చేసుకొన్న వస్తువులు, పరికరాలను నేరుగా వారి ఇండ్ల వద్దకే పంపేందుకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేశాయి.