న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చే రీతిలో పాకిస్థాన్లోని హ్యూండాయ్ డీలర్ చేసిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు యంగ్ ఇవాళ భారతీయ విదేశాంగ మంత్రి జైశంకర్తో మాట్లాడినట్లు విదేశాంగ కార్యాలయ ప్రతినిధి అరిందం బాగ్చి ట్వీట్ చేశారు. ఇండియాలో ఉన్న కొరియా అంబాసిడర్ చాంగ్ జే బోక్కు సోమవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. హ్యూండాయ్ కంపెనీ ఇవాళ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. వివిధ దేశాలకు చెందిన రాజకీయ, మతపరమైన అంశాలపై తాము ఎటువంటి కామెంట్ చేయబోమని ఆ కంపెనీ తెలిపింది. హ్యూండాయ్ మోటార్స్ పాలసీకి ఇది వ్యతిరేకమన్నది.