న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియాకు ఇద్దరు నాయకులు అవసరం లేదనే ఉద్దేశంతోనే వన్డే జట్టు పగ్గాలు కూడా విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు అప్పగించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్నకు ముందే విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. వన్డేల్లోనూ అతడిని సారథిగా తప్పిస్తూ బుధవారం బోర్డు రోహిత్కు వచ్చే రెండేండ్లకు గాను వన్డే కెప్టెన్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగూలీ గురువారం మాట్లాడుతూ.. ‘పొట్టి ప్రపంచకప్ సమయంలో సారథిగా కొనసాగమని విరాట్ను కోరాం.
అందుకు అతడు అంగీకరించలేదు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు వద్దనే ఉద్దేశంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మోతాదుకు మించిన నాయకత్వంతో జట్టుకు ఇబ్బంది అవుతుందని సెలెక్టర్లు భావించారు. ఆ ఇబ్బంది ఏంటో నాకైతే తెలియదు. వన్డే, టీ20లకు రోహిత్, టెస్టులకు విరాట్ కెప్టెన్లుగా కొనసాగుతారు’ అని అన్నాడు. కెప్టెన్సీ విషయంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మతో పాటు తానూ విరాట్తో చర్చించినట్లు దాదా పేర్కొన్నాడు.