న్యూఢిల్లీ, మార్చి 27: ప్రముఖ చలనచిత్ర ప్రదర్శన సంస్థలైన పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ విలీనం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని రెండు సంస్థల డైరెక్టర్ల బోర్డులు ఆదివారం ఆమోదించాయి. షేర్హోల్డర్ల ఆమోదం, స్టాక్ ఎక్సేంజీ, సెబీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు లభించి ఒప్పందం అమలైతే విలీనం పూర్తవుతుంది. తద్వారా 1,500కు పైగా స్క్రీన్లతో దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్ చైన్గా ఆవిర్భవిస్తుంది. ఉమ్మడి సంస్థకు పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్గా నామకరణం చేయనున్నారు. పీవీఆర్ సీఎండీ అజయ్ మేనేజింగ్ డైరెక్టర్గా, సంజీవ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. డైరెక్టర్ల బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఐనాక్స్ గ్రూప్ చైర్మన్ పవన్కుమార్, నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్గా సిద్ధార్థ్ జైన్ ఉంటారు. కొత్త సంస్థలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం, ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభిస్తుంది. ఐనాక్స్ షేర్ హోల్డర్లందరికీ పీవీఆర్ షేర్లు లభిస్తాయి.