న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో శుక్రవారం విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. సమావేశంలో 15 పార్టీలు పాల్గొననుండగా.. ఇవాళ సాయంత్రం వర్చువల్ విధానంలో భేటీ జరుగనుంది. బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద పవార్ సహా ఆయా పార్టీల నేతలు పాల్గొనున్నారు. సమావేశానికి ఆమ్ ఆద్మీ, బహుజన సమాజ్ పార్టీలను ఆహ్వానం అందలేదు. బెంగాల్ సీఎం మమత ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా సోనియా సహా పలువురు నేతలను కలిశారు. అనుకున్నంతగా ప్రతిపక్షం బలహీనంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంగా భేటీ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ పెగాసస్ కుంభకోణం, రైతుల ఆందోళన, ద్రవ్యోల్బణం తదితర సమస్యలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి.
ప్రతిపక్షాల నిరసనతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్ని మధ్య ఈ విషయంలో సమన్వయంతో ముందుకెళ్లి కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు ముందుగా నిర్ణయించిన గడువు కంటే రెండు రోజుల ముందే ముగిసిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగే భేటీలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు వచ్చే ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించే అంశంపై అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.