వ్యవసాయయూనివర్సిటీ, డిసెంబర్ 4 : ఇష్టానుసారం రసాయనాలు, మందుల వాడకంతో నేలలు విషతుల్యమవుతున్నాయని, నేల స్వభావాన్ని బట్టి మందులను వినియోగించాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు అన్నారు. ప్రపంచ మృత్తికా దినోత్సవం పురస్కరించుకొని శనివారం వర్సిటీ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కోబోతున్న పెను సమస్యల్లో నేల లవణీయత ఒకటని, కాలుష్య కారకాలతో భూగర్భ జలాల కలుషితమై నేలలు తన స్వభావాన్ని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధనల్లో అనేక అద్భుతాలు సాధిస్తున్న యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఆహారధాన్యాలు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధిలో దేశం చాలా ముందంజలో ఉందన్నారు. సాగు రంగంలో మూడోదశ విప్లవం కొనసాగుతుందని గుర్తుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్లు, బ్లాక్చైన్ టెక్నాలజీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీతో వ్యవసాయాన్ని మరింత పరిపుష్టం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. మృత్తికా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన,వకృత్వ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి, భూసార పరిరక్షణపై లఘుచిత్రాలు రూపొందించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్ అనిత, డాక్టర్ సీమ, ఎస్బీఐ రూరల్ డైరెక్టర్ మేనేజర్ బోగ రాంనారాయణ, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ నరేందర్రెడ్డి, బోధన,బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.