అమీన్పూర్, జనవరి 20 : ప్రేమించి పెండ్లి చేసుకుని పదేండ్లు కాపురం చేశారు. వారికి ఏడేండ్ల కూతురు కూడా ఉన్నది. సంతోషంగా జీవిస్తున్న ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబానికి ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నగర శివారు అమీన్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్ జిల్లా పోతాయిపల్లి గ్రామానికి చెందిన బాలరాజు గౌడ్, సత్యమ్మల కుమారుడు శ్రీకాంత్ గౌడ్ (42), అల్వాల్ వెంకటాపూర్కు చెందిన అనామిక (40) ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. అప్పటినుంచి అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో నివాసముంటున్నారు. వీరికి స్నిగ్ధ (7) కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ గౌడ్ హైదరాబాద్లోని టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అనామిక స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్నది.
అసలేం జరిగింది ?
రెండు రోజులుగా వారు ఎలాంటి ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి వారి నివాసానికి వచ్చి చూడగా, తలుపు వేసి లోపల గడియ పెట్టి ఉంది. పోలీసుల సాయంతో అక్కడకు చేరుకుని తలుపులు తెరిచి చూడగా.. వారంతా మృతిచెంది కనిపించారు. కాగా, వారి నుదుట ఎర్రని బొట్లు ఉండగా.. దేవుడి గదిలో చిత్రపటాలు బోర్లించి ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపి.. సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.