Telangana | గోడలపై జాజు రాతలు.. తలుపులకు ‘మీ ఓటు మాకే’ అంటూ స్టిక్కర్లు. లౌడ్స్పీకర్లతో ఆటోల్లో వీధివీధి తిరుగుతూ విన్నపాలు.. సోషల్ మీడియా ఎంట్రీతో ఈ సిత్రాలు మాయమైనయ్. ఎన్ని‘కళ’నే మారిపోయింది. మీ ఒక్క డైలాగ్ చాలు..
వేల ఓట్లు కురిపిస్తామంటున్నారు పీఆర్ ఏజెన్సీలు. అడుగు బయటపెట్టకుండానే అభ్యర్థులను ఫేమస్ చేస్తున్నారు సామాజిక మాధ్యమాల సారథులు. వాట్సాప్ స్టేటస్లో క్యాండిడేట్ లెవల్ ఫిక్స్ చేస్తున్నారు.
యూట్యూబ్ షాట్స్తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. ఇన్స్టా రీల్స్లో ఇన్స్టంట్గా ఓటర్లను వశపర్చుకుంటున్నారు. ‘ఎక్స్’ హ్యాండిల్తో గెలుపోటములను డిసైడ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా అభ్యర్థుల తరఫున
పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీలు, పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలు చూసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక్కో అభ్యర్థి కోసం ఒక్కో సోషల్ మీడియా టీమ్ పనిచేస్తున్నది.
హోరాహోరీ ప్రచారాలు పాతముచ్చట. ఇప్పుడు వార్ అంతా సోషల్ మీడియాలోనే! ఎన్నికల ప్రణాళిక అంతా మైక్రో మేనేజ్మెంట్ వైపు అడుగులు వేస్తున్నది. ఈ వ్యూహంలో ప్రతి ఇల్లూ ఒక యూనిట్. ప్రతి ఓటరూ టార్గెటే. ఇందుకు సామాజిక మాధ్యమాలే చేపల వలలుగా పనిచేస్తున్నాయి. ఈ చేపల వేటలో మత్స్యకారుల పాత్ర వ్యూహకర్తలదే. అందుకే ప్రశాంత్ కిశోర్, సౌరభ్ వ్యాస్, గౌరవ్ రాథోడ్, పార్థదాస్, సందీప్ పాఠక్ వంటి మేధావులతో పార్టీలు ఒప్పందం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కూడా జాతీయస్థాయిలో ప్రముఖంగా వినిపించే ఐప్యాక్, మైండ్ షేర్ అనలిటిక్స్, మిషన్ చాణక్య, పొలిటికల్ ఎడ్జ్, ఆప్కోర్ టీమ్ వంటి సంస్థలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇందుకోసం ఈ సంస్థలు అభ్యర్థుల రేంజ్ను, అందించాల్సిన సేవలను బట్టి లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నాయి.
ఖర్చుకు తగినంత ఎలివేషన్స్..
సోషల్ మీడియా అకౌంట్లలో వేలల్లో ఫాలోవర్స్, లైక్స్ ఉంటేనే టికెట్లు ఇస్తామని కొన్ని పార్టీలు ప్రకటించాయంటే సామాజిక మా ధ్యమాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థుల బలం ఏపాటిదో తెలుసుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియానే కొలమానం. అందుకే ఇన్ఫ్లూయెన్సర్ల టీమ్లు ఇప్పుడు కీలకంగా మారాయి. ఫాలోవర్లు, లైక్లు పెంచే టెక్నిక్లు ఈ బృందాల దగ్గర ఉంటాయి. ఇక, అభ్యర్థులకు సినిమాటిక్ ఎలివేషన్స్ ఇచ్చి సోషల్ మీడియాలో హీరోను చేస్తాయి. తమ అభ్యర్థి.. ప్రజలతో మాట్లాడే విధానం మొత్తం క్యాడిడ్ ైస్టెల్లో వీడియోలు, ఫొటోలు తీయడం, వాటిని అందంగా ఎడిట్ చేయడం, దానికి సరిపడే బీజీఎమ్ జత చేయడం లాంటివన్నీ వీళ్లే చూసుకుంటారు. తమ అభ్యర్థిని ఓటరు దగ్గరికి తీసుకెళ్లేందుకు కొన్ని సంస్థలు లైకులు, కామెంట్లు, పోస్టులకు సైతం డబ్బులిప్పిస్తున్నాయి. ఒక అభ్యర్థికి పాజిటివ్గా ఎవరైనా వ్యక్తులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఏదైనా ఒక పోస్టు పెడితే రూ.50 నుంచి రూ.100 వరకు ఇస్తున్నారట కూడా. ఇక బ్లూటిక్ బాబులు తమకు అనుకూలంగా పోస్టుపెడితే లక్షల్లో ముట్టుజెబుతున్నారట.
ఉపాధి మార్గం..
ఎన్నికల ప్రచారంలో ఈ కొత్త పోకడల కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామందికి ఉపాధి లభిస్తున్నది. కంటెంట్ రైటర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, వీడియో, ఫొటోగ్రాఫర్లు, సర్వేయర్లు, లిరిక్ రైటర్లు, సంగీత దర్శకులు, సోషల్ మీడియా లోతుపాతులు తెలిసిన ఎస్ఈవోలు, ట్యాగ్ ఎక్స్పర్ట్స్ వంటి వారిని కాంట్రాక్టు పద్ధతిన నియమించుకుంటున్నాయి పీఆర్ ఏజెన్సీలు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపడానికి, ఓటర్ల నంబర్లు సేకరించేందుకు, ఫోన్లు చేసి ఓట్లు అడిగేందుకు కూడా తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. మొత్తంగా ఎన్నికల ప్రచార జోరు బయట కన్నా సోషల్ మీడియాలోనే రంజుగా సాగేలా కనిపిస్తున్నది.
…? రవికుమార్ తోటపల్లి