తిరుమల : బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిసారిగా పటికబెల్లం, కివిపండ్లు, ఎరువు పవిత్ర మాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ వాసుదేవ భట్టాచార్యులు కార్యక్రమం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో కురువేరు, తెల్లపట్టు, రంగురంగుల ఎండుఫలాలు, వట్టివేరు, పసుపు రోజామాలలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి అలంకరించారు.
వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చకస్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. శోభాయమానంగా సాగిన ఈ స్నపన తిరుమంజనాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. తిరుపూర్కు చెందిన చెందిన దాత రాజేందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు, హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్, శ్రీధర్ సహకారంతో రంగనాయకుల మండపం అలంకరణ చేశామని టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్రెడ్డి దంపతులు, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.