ఇన్నాళ్లూ అరచేతికే పరిమితమైన స్మార్ట్ ప్రపంచం.. ఇప్పుడు రిస్ట్వాచ్లోకి దూరింది. ఎవరిని చూసినా కుడిచేతిలో స్మార్ట్ఫోన్, ఎడమ చేతికి స్మార్ట్వాచ్. కాబట్టే, ఈ ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్వాచ్ల మార్కెట్ 173 శాతం వృద్ధి చెందింది. ఈ సాంకేతిక విప్లవాన్ని మన దేశానికి తీసుకొచ్చిన ఘనత ఆయుషి కిశోర్ అనే పాతికేండ్ల అమ్మాయిదే. ఆమె నేతృత్వంలో వేరబుల్ టెక్నాలజీ సంస్థ ‘ఫైర్బోల్ట్’ అద్భుతాలు చేస్తున్నది.
‘మీకు ఏవైనా సందేహాలు వస్తే నన్ను అడగండి. వెంటనే నివృత్తి చేసుకోండి. ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయం వద్దు. ప్రశ్నిస్తేనే పరిష్కారం దొరుకుతుంది’ అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది ఆయుషి కిశోర్. స్మార్ట్ టెక్నాలజీ వ్యాపారంలో ఆమె ఫైర్బ్రాండ్. ఆమె మాటలు సిబ్బందికి వెయ్యివోల్టుల శక్తినిచ్చే స్ఫూర్తి కేంద్రాలు. కాబట్టే, ఆమె కలలపంట అయిన ‘ఫైర్ బోల్ట్’ ఇండియాలోనే నంబర్వన్ స్మార్ట్ వేరబుల్ టెక్నాలజీ కంపెనీగా పేరు తెచ్చుకున్నది. ఈ ఏడాది కోటిమంది కస్టమర్లను చేరుకుంది. దాదాపు 500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఆ విజయంలో ఆయుషి కృషి అపారం. వచ్చే ఏడాదికి ఆదాయాన్ని మూడురెట్లు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నది ఫైర్ బోల్ట్.
వ్యాపారుల కుటుంబం..
ఆయుషి వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి లలిత్ సామాన్యుడు కాదు. నైకి లాంటి పెద్ద బ్రాండ్స్ను ఇండియాకు తీసుకొచ్చారు. ఆయుషి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ అందుకుంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేసింది. ఫైర్బోల్ట్ ఉత్పత్తులలో స్మార్ట్వాచ్లు, బ్లూటూత్ ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్, వైర్లెస్ ఇయర్బడ్స్, బ్లూటూత్ స్పీకర్స్, సౌండ్ బార్స్.. తదితర ఉత్పత్తులు ఉన్నాయి. ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి ప్రముఖ క్రికెటర్లతో ప్రచారం చేయిస్తూ.. తమ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నది ఆయుషి.