అమరావతి : ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇవాళ స్వల్పంగా భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, కొండాపురం, వింజమూరు, వరికుంటపాడు మండలాల్లో భూమి రెండు సెకన్లపాటు కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా పామూరు పరిసర గ్రామాల్లో మూడు సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూప్రకంపనలు వచ్చిన సమయంలో ఇళ్లలో ఉండే ప్రజలు బయటకు వచ్చి ఆరుబయట ఉండాలని భవంతులు, భారీ చెట్ల సమీపంలో ఉండవద్దని అధికారులు కోరారు.