హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ)/కుత్బుల్లాపూర్: మంత్రి శ్రీనివాస్గౌడ్ కేసులో ఏడుగురు నిందితులు అన్నింటికి సరైన సమాధానాలు ఇస్తున్నప్పటికీ హత్యకు పన్నిన కుట్ర విషయాలు అడిగినప్పుడు మాత్రం సమాధానాలను దాటవేస్తున్నట్టు తెలిసింది. చర్లపల్లి జైలు నుంచి నిందితులు రాఘవేంద్రరాజు, నాగరాజు, మధుసూదన్రాజు, అమరేందర్రాజు, యాదయ్య, విశ్వనాథ్, మున్నూరు రవిని బుధవారం పేట్బషీరాబాద్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని నేరుగా అల్వాల్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం నిందితులను పేట్బషీరాబాద్ ఇన్స్పెక్టర్ రమేశ్, ఏసీపీ రామలింగరాజు కొద్దిసేపు ప్రశ్నించారు. నిందితులు హత్యకు పన్నిన కుట్ర విషయాలపై జవాబులు దాటవేస్తున్నట్టు తెలిసింది. మరో మూడు రోజులపాటు విచారణ కొనసాగనున్నది.
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు జరిగిన కుట్ర కేసులో నిందితులు బీ విశ్వనాథ్, మున్నూరు రవిని ఈ నెల 13 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యకాలంలో విచారించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత వారిని రాత్రి 7 గంటల్లోగా చర్లపల్లి జైలు సూపరింటెండెంట్కు అప్పగించాలని జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునే ముందు, కస్టడీ పూర్తయ్యాక జైల్లోని వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 13న పోలీసుల విచారణ అయ్యాక నిందితులను మేడ్చల్లోని 22వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి జైలుకు తరలించాలని తెలిపారు. నిందితులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.