ఎస్ఐపీ ఆర్థిక క్రమశిక్షణకు గురువు
మార్కెట్లలో ఒడిదుడుకులు సహజం. ఉత్థాన పతనాల్లో ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్లో పొరపాట్లు కూడా అంతే సహజం. మార్కెట్ పతనం అవుతున్నప్పుడు దూరంగా ఉండ డం, గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు మరింత పెరుగుతుందన్న ఆశతో కొనుగోలు చేయడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ నష్టపోతూ ఉంటారు. అయితే ఇలాంటి పొరపాట్లనుంచి బయట పడేందుకు మార్గాలనేకం. ఏకమొత్తంగా పెట్టుబడులు పెట్టడం కన్నా, క్రమేపీ నెలసరి మదుపులతో ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అలాగే, పెట్టుబడి మొత్తాన్ని ఒకే ఆర్థిక సాధనంలో మదుపు చేయకుండా, స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రయోజనాలకు తగ్గట్టుగా వేర్వేరు సాధనాల్లో మదుపు చేయడం ఉత్తమ మార్గం.
అందుకే మన ఈక్విటీ మార్కెట్ రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతుంది. కొత్త ఇన్వెస్టర్లు కోటి మందితో మార్కెట్ కళకళలాడుతోంది. మరో సారి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ మదుపు వాతావరణాన్ని ప్రోత్సహించేవిగా పరిగణించాలి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)ల మార్గంలో పెడితే అంచనాలకు తగ్గ రాబడులను ఆశించవచ్చు.
ఎస్ఐపీ పద్ధతిలో మదుపు అర్థం చేసుకోవడం చాలా సులభం. వీటిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా చాలా ఆదరణ పొందాయి. ఎస్ఐపీ రూపంలో ప్రతినెలా సగటున రూ.8000 కోట్లు వస్తున్నాయంటే వాటికున్న ఆదరణ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (ఆంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్లలో కొత్తగా 3.39 లక్షల కోట్ల మంది ఎస్ఐపీల ద్వారా మదుపు చేయడం మొదలుపెట్టారు.