వరంగల్, మార్చి 12(నమస్తే తెలంగాణ): సింగిల్పట్టీ మిర్చి రైతులకు సిరులు కురిపిస్తున్నది. ఘాటు తక్కువ, మంచి రంగు ఉండటం దీని ప్రత్యేకత. ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు. ఈ రకానికి పొరుగు రాష్ర్టాల్లోనూ విపరీతమైన డిమాం డ్ ఉన్నది. ఈ నేపథ్యంలో సింగిల్పట్టీ మిర్చి ధర బంగారాన్ని తలపిస్తున్నది. ఇటీవల వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.42 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో సింగిల్పట్టీ రకం మిర్చికి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. అదిరిపోతున్న ధరతో రైతులు, వ్యాపారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు మార్కెట్లో సింగిల్పట్టీ మిర్చికి మంచి గిరాకీ ఉన్నది.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపురం, భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ, హనుమకొండ జిల్లాలోని పరకాల, శాయంపేట, నడికూడ మండలాల్లోని కొన్ని గ్రామాల రైతులు మాత్రమే సింగిల్పట్టీ రకం మిర్చిని పండిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన వడగండ్ల వానలతో ఈ రకం మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దీని దిగుబడి తగ్గింది. నాణ్యత కూడా దెబ్బతిన్నది. ఈ క్రమంలో ఈ రకానికి మార్కెట్లో భారీగా డిమాండ్ పెరిగింది. ఎకరానికి పెట్టుబడి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అవుతుండగా, 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. ఇందులో మేలు రకం కేవలం 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు ఉంటే.. నాణ్యత కోల్పోయిన మిర్చి 4 క్వింటాళ్లు, తాలు 5 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ ఏడాది వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సింగిల్పట్టీ మేలు రకం మిర్చి ధర క్వింటాల్ రూ.25 వేల నుంచి రూ.42 వేల వరకు పలికింది. గత గురువారం రికార్డు స్థాయిలో రూ.42 వేలు దక్కింది. మునుపెన్నడూ సింగిల్పట్టీ మిర్చికి ఇంత ధర పలుకలేదు. గత ఏడాది ఈ మార్కెట్లో ఈ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.17 వేల నుంచి రూ.26 వేల వరకు మాత్రమే వచ్చింది. మార్కెట్ చరిత్రలో అదే రికార్డు ధర. ఈ ఏడాది అనూహ్యంగా క్వింటాల్ ధర రూ.42 వేలకు ఎగబాకింది.
సింగిల్పట్టీ మిర్చికి ఇతర రాష్ర్టాల్లోనూ అధిక డిమాండ్ ఉన్నది. ఏపీలోని తాళ్లపల్లిగూడెం, రాజమండ్రి, మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలోని ప్రజలు పచ్చళ్ల కోసం ఈ మిర్చిని అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో సీజన్లో ఏపీ, మహారాష్ట్ర నుంచి ఖరీదుదారులు ఈ రకం మిర్చి కోసం ఎనుమాముల మార్కెట్కు వస్తున్నారు. స్థానిక ఖరీదుదారులు కూడా పోటీపడి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఎనుమాముల మార్కెట్కు రోజు వేల బస్తాల సింగిల్పట్టీ మిర్చి విక్రయానికి వచ్చేది. ప్రస్తుతం రోజుకి వందల బస్తాల్లో మాత్రమే వస్తున్నది. దీంతో ఈ రకం కొనుగోలుకు తీవ్ర పోటీ ఏర్పడింది.
సింగిల్పట్టీ మిర్చి అంటే మిరపలో ఓ రకమైన పంట. సాధారణంగా రైతులు తేజ, వండర్హాట్, యూఎస్ 341, దీపిక, దేశీ తదితర రకాల మిర్చిని సాగు చేస్తుంటారు. సింగిల్పట్టీ మిర్చి ఎక్కువ రంగు, తక్కువ ఘాటు ఉండటంతోపాటు మంచి రుచి కలిగి ఉంటుంది. దీంతో దీనిని పచ్చళ్ల తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు.
ఈ ఏడాది సింగిల్పట్టీ రకం మిర్చిని రెండెకరాల్లో సాగు చేశా. ఎకరానికి రూ.30 వేలకు పైగా పెట్టుబడి అయింది. అకాల వర్షాల వల్ల పంట బాగా దెబ్బతిన్నది. దిగుబడి తగ్గింది. నాణ్యత కూడా మారింది. గతంలో ఎకరానికి 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ఎకరంలో 12.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో మేలు రకం కేవలం మూడున్నర క్వింటాళ్లు ఉంటే మచ్చ రకం 4 క్వింటాళ్లు, తాలు రకం 5 క్వింటాళ్లు ఉంది. మేలు రకానికి క్వింటాల్ ధర గురువారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రూ.42 వేలు లభించింది.
– పీ సత్యనారాయణరావు, రైతు, పంచోత్కులపల్లి, ములుగు జిల్లా