బంజారాహిల్స్, డిసెంబర్ 30: ప్రముఖ గాయని సునీతతో కలిసి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ నగరవాసులను తమ సంగీత మాధుర్యంలో ఓలలాడించనున్నారు. జనవరి 8న మాదాపూర్లోని శిల్ప కళా వేదికలో ‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత’ పేరుతో మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించనున్నారు. బంజారాహిల్స్లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాయని సునీత వివరాలను వెల్లడించారు. రెండేళ్లుగా కరోనా కారణంగా అందరిలో ఏదో తెలియని ఆందోళన ఉందని, సుమధురమైన సంగీతంతో ఆహ్లాదాన్ని పంచేందుకు లైవ్ ఇన్ కన్సర్ట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అనేక అంతర్జాతీయ వేదికలపై తన సంగీతంలో శ్రోతలను ఆకట్టుకున్నాడని, కొవిడ్ తర్వాత నగరంలో జరుగుతున్న తన తొలి కన్సర్ట్ ఇదేనని వెల్లడించారు. తన 25 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, అమర గాయకుడు ఎస్పీ బాలు సూచనలతో పాట మీద మమకారం, నిబద్దత పెరిగిందని, ఆయన భౌతికంగా లేకున్నా తన పాట ద్వారా అందరి హృదయాల్లో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ ఎండీ నరాల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.