సిద్దిపేట, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర రాజధానిలోని ఇందిరాపార్కు వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రి హరీశ్రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్లు, రైతు బంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. పంజాబ్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తూ, తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని గ్రామగ్రామాన వివరించేందుకు టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. నాడు కేవలం వేల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. సీఎం కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలతో నేడు లక్షల ఎకరాల్లో సాగు భూమి అందుబాటులోకి వచ్చి పసిడి పంటలు పండుతున్నాయి. ఇదిగిట్టని బీజేపీ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. హైదరాబాద్లో మహాధర్నాను చూసైనా కేంద్రం కళ్లు తెరవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టత వచ్చే వరకు తమ పోరాటం ఆగదని, మరిన్ని ఉద్యమాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణు లు, రైతులకు పార్టీ అధిష్టానం సూచించింది. బీజేపీని నమ్ముకుంటే నష్టపోతారని, ప్రతీ రైతు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వం సూచిస్తున్నది.