సిద్దిపేట/హుస్నాబాద్ టౌన్, నవంబర్ 10 : సిద్దిపేట జిల్లా మరో దేశస్థాయి ఖ్యాతిని గడించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డుకు సిద్దిపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈ అవార్డు కోసం ప్రధానంగా 3 అంశాలు, 50 సూచికలు కీలక భూమిక పోషించాయి. ముఖ్యంగా సేవా స్థాయి పురోగతిలో నాణ్యమైన చెత్త సేకరణ, చెత్త సేకరణ వాహనాల నిర్వహణ, పారిశుధ్య పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ఛ యాప్ ఉపయోగించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ఈ అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను ఈ నెల 20న రాష్ట్రపతి చేతుల మీదుగా సిద్దిపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్లు కడవేర్గు మంజులారాజనర్సు, ఆకుల రజితావెంకన్న, కమిషనర్లు రమణాచారి, రాజమల్లయ్య అందుకోనున్నారు. ఈ మేరకు వారికి ఢిల్లీ ఆహ్వానాలు అందాయి.
3 ప్రధాన అంశాలు.. 50 సూచికలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డు ఎంపికకు ప్రధానంగా 3 అంశాలు, 50 సూచికలు కీలక భూమిక పోషించాయి. ముఖ్యంగా సేవా స్థాయి పురోగతిలో నాణ్యమైన చెత్త సేకరణ, చెత్త సేకరణ వాహనాల నిర్వహణ, పారిశుధ్య పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ఛ యాప్ ఉపయోగించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో పురపాలక సంఘాలు చేసిన పనితీరుకు అవార్డు లభించాయి. పాలకవర్గ సభ్యులతోపాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది కృషితో అవార్డులకు ఎంపిక అయ్యాయని చైర్పర్సన్లు, కమిషనర్లు తెలిపారు. అవార్డులపై హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటికే సిద్దిపేటకు 18 అవార్డులు
సిద్దిపేట మున్సిపాలిటీ ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో 18 అవార్డులు వరించాయి. 2012లో క్లీన్ సిటీ చాం పియన్ షిప్ రాష్ట్రస్థాయి అవార్డు, 2015లో సాలిలెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో జాతీయస్థాయిలో ఎక్సలెన్సీ అవార్డు, 2016లో జాతీయ స్థాయిలో పారిశుధ్య నిర్వహణపై ఎక్సలెన్సీ అవార్డు, 2016లో రాష్ట్రస్థాయిలో హరితమిత్ర అవార్డు, 2016లో చెత్త సేకరణలో స్కోచ్ అవార్డు, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణంలో జాతీయస్థాయి అవార్డు, 2016లో జాతీయస్థాయిలో ఓడీఎఫ్ సర్టిఫికెట్, 2016లో రాష్ట్రస్థాయిలో ఎక్సలెన్సీ అవార్డు, 2017లో జాతీయస్థాయిలో రాష్ట్రీయ స్వచ్ఛభారత్ పురస్కార్, 2017లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు, 2017లో జాతీయస్థాయిలో ఐఎస్వో అవార్డు, 2018లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో జాతీయస్థాయి స్కోచ్ అవార్డు, 2018లో స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు, 2018లో పట్టణ పారిశుధ్య నిర్వహణలో 6 పద్ధతులు అమలు చేస్తున్నందుకు గానూ జాతీయస్థాయి స్కోచ్ అవార్డు, 2018లో స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం, 2019లో జాతీయస్థాయిలో స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు, 2019లో జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, 2021లో వంద శాతం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా నిర్వహణకు స్కోచ్ అవార్డులు లభించాయి.
ప్రజల ఐక్యత, భాగస్వామ్యానికి నిదర్శనం
సిద్దిపేట పట్టణ ప్రజల ఐక్యత, భాగస్వామ్యం గొప్పది. అభివృద్ధి, అవార్డుల్లో వారు ఎంతో స్ఫూర్తి చాటారు. స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైనందనున ప్రజలందరికీ శుభాకాంక్షలు. వివిధ అంశాల్లో 17 అవార్డులు సాధించగా, ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల అంకిత భావంతో నేడు మరో జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. స్వచ్ఛసర్వేక్షణ్లో ఏ కార్యక్రమం చెప్పినా, ఏ పిలుపునిచ్చినా ప్రజలు ఎంతో చైతన్యం చూపారు. ఇదే స్ఫూర్తితో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి, ఆదర్శంగా నిలిపి, మనందరి కృషి ఫలితంగా మరిన్ని అవార్డులు సాధించాలి.
ప్రజల సహకారంతోనే అవార్డు..
ప్రజలు, మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది సహకారం, కృషితో స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డు రావడం అభినందనీయం. స్వచ్ఛ భారత్లో భాగంగా పట్టణంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను మిగతా పట్టణాలకు ఆదర్శంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు కృషిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. కరోనా సమయంలో పారిశుధ్య సిబ్బంది, పాలకవర్గం కృషి ఇందుకు దోహదం చేసింది.
-వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్యే హుస్నాబాద్
మంత్రి హరీశ్రావు సహకారం.. ప్రజల చైతన్యం
సిద్దిపేట అభివృద్ధిలో ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్రావు స్ఫూర్తి, సహకారంతో పట్టణం అభివృద్ధి పథంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో మంత్రి హరీశ్రావు సూచనలు, సలహాలతో పాటు ప్రజల భాగస్వామ్యం, అధికారుల పనితీరుకు ఈ అవార్డు వచ్చింది.
అవార్డు రావడం ఆనందంగా ఉంది..
హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. పాలకవర్గం, అధికారులు, పారిశుధ్య సిబ్బంది సమష్టి కృషితో అవార్డు వచ్చింది. ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సలహాలు, సూచనల మేరకు పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించాం. పట్టణాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. అవార్డు వచ్చేందుకు కృషిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.