Shruti Hasaan | విమర్శలు ఎదుర్కోవడం సెలబ్రిటీ జీవితంలో సహజం. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విమర్శలు మరింత పెరిగిపోయాయి. స్టార్గా తాను ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతోంది హీరోయిన్ శ్రుతి హాసన్. ప్రేమమ్ సినిమాలో నటించిన సమయంలో తనను ఎక్కువగా ట్రోల్ చేశారని.. టాలీవుడ్లో తనను ట్రోల్ చేసిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమానే అని చెప్పుకొచ్చింది.
మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో నాగచైతన్య హీరోగా నటించాడు. ఇక మలయాళంలో సాయిపల్లవి చేసిన టీచర్ మలర్ క్యారెక్టర్ను శ్రుతి హాసన్ పోషించింది. అయితే ప్రేమమ్ మాతృక చూసిన వాళ్లలో చాలామంది సాయిపల్లవి నటనతో శ్రుతి హాసన్ పర్ఫార్మెన్స్ను పోల్చడం మొదలుపెట్టారు. అలా మలర్ క్యారెక్టర్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది శ్రుతి.
వాస్తవానికి ప్రేమమ్ రీమేక్లో తనకు ఆఫర్ వచ్చినప్పుడు అందులో నటించాలని అనుకోలేదని శ్రుతి హాసన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. క్యారెక్టర్ కొత్తగా ఉండటంతో కాస్త ఆలోచించి ఆ పాత్ర ఒప్పుకున్నాని తెలిపింది. సాయిపల్లవిలా కాకుండా.. నా స్టైల్లో ఆ పాత్ర చేయాలని అనుకున్నా అని పేర్కొంది. అయితే ప్రేమమ్ తెలుగులోనూ విజయాన్ని సాధించింది. శ్రుతి హాసన్కు ఉన్న ఫ్లాప్ సెంటిమెంట్ను కొంతైనా చెరిపేసింది. అదే ఆ సినిమా చేయకుండా ఉంటే తన జీవితంలో ఓ మంచి చిత్రాన్ని కోల్పోయి ఉండేదాన్ని అని గుర్తు చేసుకుంది.
గతేడాది రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా విజయంతో తిరిగి ఫామ్లోకి వచ్చింది శ్రుతి హాసన్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ చిత్రంలో నటించి సక్సెస్ కంటిన్యూ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ సలార్తో పాటు బాలకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ నటిస్తోంది.