తిరుమల, జూలై : లోక కల్యాణార్థం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న శ్రౌత యాగాల్లో భాగంగా 6వ రోజైన గురువారం సర్వ పృష్టేష్టి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహేన్ద్రయాగ పూర్వక మృగారషట్కము అనే శ్రౌత యాగాలు జూలై 10వ తేదీ నుంచి జరుగుతున్నాయి. ఈ యాగాలు రేపటితో ముగియనున్నాయి.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో వేద విజ్ఞానపీఠంలో 9 మంది ప్రముఖ రుత్వికులు త్రేతాగ్నులు అనే హోమగుండాలలో అగ్నిని మదించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాగాలు (ఇష్టి) నిర్వహిస్తున్నారు. ఈ యాగాలు నిర్వహించడం వల్ల అగ్ని నుంచి విష్ణువు వరకు సమస్త దేవతల అనుగ్రహం పొందుతారని, లోకంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉంటాయని, ఆరు ఋతువులలో సుభిక్షంగా ఉంటారని, సర్వ పాపాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు.