రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులున్నాయని, గొప్ప సినిమాల్లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది సీనియర్ కథానాయిక శ్రియ. నటనలో తాను నిత్య విద్యార్థినని, ప్రాణమున్నంత వరకు చిత్రసీమలోనే కొనసాగాలన్నది తన ఆశయమని స్పష్టం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకురాలు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం శ్రియ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
సినీ రంగంలో రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. సుదీర్ఘ కెరీర్ను విశ్లేషించుకుంటే ఏమనిపిస్తున్నది?
ఇదంతా భగవంతుడి దయగా భావిస్తున్నా. దేవుడి అపారమైన శక్తి మీద నాకు నమ్మకం ఉంది. మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. అమ్మనాన్నలు చక్కటి విలువలు, క్రమశిక్షణతో పెంచారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా కెరీర్లో గొప్ప స్థానానికి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ నేను మీ పక్కింటి అమ్మాయినే అనుకుంటా. నా తొలి చిత్రం ‘ఇష్టం’ షూటింగ్ జ్ఞాపకాలు ఇంకా కళ్లముందున్నాయి.
చిత్రసీమలో ఇంకా సాధించాల్సిన లక్ష్యాలేమైనా ఉన్నాయా?
సినీ రంగంలో నేను ఎప్పటికీ నిత్య విద్యార్థినే. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకుంటున్నా. బతికున్నంత వరకు సినిమాల్లోనే కొనసాగాలనే కోరిక ఉంది. నేను గమ్యం కంటే ప్రయాణాన్ని ఇష్టపడతాను. ఇరవైఏళ్ల కెరీర్లో గొప్ప సినిమాల్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.
‘గమనం’ కథాంశంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలేమిటి?
దర్శకురాలు సుజనా రావు ఈ కథ చెప్పినప్పుడు కన్నీళ్లొచ్చాయి. ఓ భావోద్వేగభరిత ప్రయాణాన్ని చూసినట్లుగా అనిపించింది. ఈ కథను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచనతో వెంటనే సినిమాకు అంగీకరించా. కొన్ని కథల్లో ఏదో తెలియని మంత్రశక్తి ఉంటుంది. ఈ సినిమా అలాంటిదే. ‘గమనం’లో నేను చెవిటి మహిళగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం కొన్ని క్లాస్లకు కూడా వెళ్లాను. ఓ నిస్సహాయ మహిళగా ఊహకు అందని అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతూ జీవిస్తుంటా.
మహిళా దర్శకురాలితో పనిచేయడంలో ఉన్న సౌలభ్యమేమిటనుకుంటున్నారు?
మహిళా దర్శకురాలితో ‘మిడ్నైట్ స్టోరీస్’సినిమా చేశాను. కన్నడంలో కూడా ఓ సినిమాలో నటించా. లేడీ డైరెక్టర్తో తెలుగు సినిమా చేయడం ఇదే తొలిసారి. మహిళా దర్శకులతో పనిచేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. మన వ్యక్తిగత సమస్యల్ని కూడా ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహిళా దర్శకులు గొప్ప కథలతో సత్తాచాటుతున్నారు.
‘గమనం’ సినిమాలో ఏ అంశాల్ని స్పృశించారు?
మన అంతరంగ సంఘర్షణకు అద్దం పట్టే చిత్రమిది. మన హృదయాన్ని మనం తెలుసుకునేలా చేస్తుంది. నిరాశలో ఉన్న వారికి ధైర్యాన్ని నూరిపోస్తుంది. నా డెలివరీ సమయంలో చాలా భయపడ్డా. కానీ ధైర్యంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో అంతా సాఫీగా జరిగిపోయింది. ఇందులోని మూడు కథలు ఒకే కాలంలో సాగుతాయి. ప్రతి కథ స్ఫూర్తినింపేలా ఉంటుంది. ప్రకృతి శక్తులతో పోరాటం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నేను ప్రకృతి ప్రకోపం వల్ల ఓ రూమ్లో బందీనై ఉంటా. దాని నుంచి ఎలా బయటపడ్డానన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
సుదీర్ఘ కెరీర్లో సినిమాలపరంగా మీ ప్రాధామ్యాలు ఏమైనా మారాయా?
సవాలుతో కూడిన పాత్రలు చేయాలనుకుంటున్నా. భవిష్యత్తులో నా కూతురు సినిమాలు చూసి ‘ఇలాంటి సినిమాలు ఎందుకు చేశావ్’ అని ప్రశ్నించకూడదు.
తల్లయ్యాక మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి?
చాలా మార్పులొచ్చాయి. రెగ్యులర్గా వర్కవుట్స్ చేస్తూ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాను. నాకు చిన్నతనం నుంచి యోగా చేసే అలవాటుంది. దాని వల్ల ఆరోగ్యపరంగా ఎప్పుడూ భేషుగ్గా ఉంటాను. ఎవరికైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత ప్రపంచం మొత్తం మారుతుంది. బాధ్యతలూ పెరుగుతాయి. ప్రస్తుతం మేం ఎక్కకు వెళ్లినా మా పాపను వెంట తీసుకొని వెళ్తున్నాం.