మెదక్రూరల్, మార్చి17: చిన్నతనంలోనే శారీరక, మానసిక ఎదుగుదలను గమనించి సమతుల ఆహారాన్ని అందించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించొచ్చని మెదక్ జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి జయరాంనాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోషణ్ అభియాన్పై ఐసీడీఎస్ సూపర్ వైజర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి నెలా అంగన్వాడీ టీచర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి పరిధిలోని గృహిణులను సందర్శించి, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, కిశోర బాలికలు, నవజాత శిశువులను గుర్తించాలన్నారు. వారు సంతులిత ఆహారం తీసుకునేలా ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషణ లోపంతో బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం, చిరుతిళ్లు అందిస్తున్నదన్నారు. కొంతమంది చిన్నారులు పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేకపోవడం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారుల ఆరోగ్య స్థితిగతులపై అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు పరిశీలించి, వయస్సుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించాలన్నారు. వారికి సరైన ఆహారం అందించడంతోపాటు జాగ్రత్తలు, అదనపు ఆహారం తీసుకునేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. బలహీనంగా ఉన్న పిల్లల జాబితాలో మన జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కిశోర బాలికలకు ఆరోగ్య సంబంధ అంశాలపై పూర్తిగా వివరించాలని సూచించారు. తల్లి పాలు ఎంతో శ్రేష్టమని పుట్టిన బిడ్డకు గంట లోపే ముర్రుపాలు పట్టించాలని, దీంతో బిడ్డకు కావాల్సిన కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు, కార్బోహైడైడ్లు, ఖనిజాలతో పాటు మెదడు కణాల రక్షణకు తోడ్పడుతాయని అన్నారు. నిర్ణీత కాలం ప్రకారం పిల్లలకు టీకాలు ఇప్పించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యమంతమైన జిల్లా గా తీర్చదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, సీడీపీవోలు హేమ భార్గవి, భార్గవి, అంగన్వాడీ సూ పర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.