చెన్నై : ఓ వీధికి చెందిన వారికి వస్తువులను అమ్మేందుకు నిరాకరించిన కిరాణా దుకాణం యజమానిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని టెన్కాసిలో వెలుగుచూసింది. గ్రామ పెద్దల నిర్ణయంతోనే తానిలా చేశానని దుకాణం నిర్వాహకుడు చెబుతున్నారు. అరెస్టయిన దుకాణాదారును మహేశ్వరన్గా గుర్తించారు.
కొందరు విద్యార్ధులు దుకాణంలో స్నాక్స్ కోసం వెళ్లగా మీ వీధికి చెందిన వారికి వస్తువులను ఇవ్వవద్దని గ్రామ పెద్దలు నిర్ణయించారని, ఈ విషయం ఇంటికి వెళ్లి మీ కుటుంబ సభ్యులకూ చెప్పండని నిందితుడు కోరాడు.
ఈ అంశానికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు ఎప్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ షాపును అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన గ్రామ పెద్దను కూడా అరెస్ట్ చేశారని జిల్లా అధికారులు తెలిపారు.