అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సొంత గ్రామంలో షాక్ తగిలింది. నారావారిపల్లెలో ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆ పార్టీ అభ్యర్థి రాజయ్య వెయ్యికిపైగా ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గంగాధరంపై విజయం సాధించారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందగా.. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మరో వైపు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ తెలుగుదేశం తుడుచుపెట్టుకుపోయింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ 17 చోట్ల గెలుపొందగా.. టీడీపీ అధినేత సొంత నియోజకవర్గంలో రెండు స్థానాలకే పరిమితమైంది. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో స్థానాల్లో అన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్ని చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. శాంతిపురం మండలంలో 18 స్థానాలకు 11 చోట్ల వైఎస్సార్సీపీ, ఒక స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోగా.. మరో ఆరు చోట్ల ఫలితాలు రావాల్సి ఉన్నది. మరో వైపు జడ్పీటీసీ ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 65 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 30 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం నాలుగు మండలాల్లో 89 పంచాయతీల్లో 75 చోట్ల వైఎస్సార్ సీపీ, 14 చోట్ల టీడీపీ గెలువగా.. కుప్పం నియోజకవర్గంలో 85 శాతానికిపైగా పంచాయతీల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది.