హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ఓఆర్ఎస్ పేరిట మార్కెట్లో చలామణి అవుతున్న టెట్రా ప్యాకెట్ల వినియోగంపై పోరాటం చేస్తే ఫార్మాస్యూటికల్ కంపెనీలు తనకు లీగల్ నోటీసులు పంపాయని, నోటీసులకు బెదిరేది లేదని డాక్టర్ శివరంజిని సంతోష్ తేల్చిచెప్పారు.
బుధవారం ఆమె వర్చువల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. గత నెల 16న ఫార్మా కంపెనీలు తనకు నోటీసులు పంపాయని వెల్లడించారు. సదరు కంపెనీల ఉత్పత్తులపై తప్పుడు ప్రచారం చేయడంతో తమ పరువుకు నష్టం వాటిల్లినట్టు నోటీసుల్లో పేర్కొన్నట్టు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డయేరియా కారణంగా 5.5లక్షల మంది పిల్లలు చనిపోతున్నారని, మన దేశంలో 1.5లక్షల మంది మరణిస్తున్నట్టు వివరించారు. తనకు లీగల్ నోటీసులు పంపిన కంపెనీపై పిడీయాట్రిషన్ల అభ్యంతరాలు, ఓ తల్లి వేసిన కేసు ఉందని ఆమె వివరించారు.