న్యూఢిల్లీ, నవంబర్ 25: అవును.. ఆమె గెలిచింది. శతాబ్దాల పురుషాధిక్యతను ఓడగొట్టింది. దేశంలో తొలిసారిగా పురుషుల కంటే మహిళల జనాభా అధికంగా నమోదైంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5లో ఈ విషయం వెల్లడైంది. మరోవైపు దేశంలో సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) తగ్గుముఖం పడుతున్నట్టు సర్వేలో తేలింది. 2015-16లో 2.2గా ఉండగా, 2019-21లో అది 2.0 శాతానికి తగ్గినట్టు తేలింది. ప్రభుత్వాలు పలు పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ దేశంలో ఇంకా పోషకాహారం లోపం వంటి అరోగ్యపరమైన సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయని సర్వే వెల్లడించింది.
మహిళలే ఎక్కువ..
దేశంలో తొలిసారిగా పురుషుల కంటే స్త్రీల సంఖ్య అధికంగా నమోదైంది. 2015-16లో వెయ్యి మంది పురుషులకుగానూ 991 మంది మహిళలు మాత్రమే ఉండగా, ఇప్పుడు స్త్రీల సంఖ్య పురుషులను దాటి 1020కి చేరింది. ఈ మేరకు 2019-21కి సంబంధించి తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో వెల్లడైంది. గత ఐదేండ్లలో లింగ నిష్పత్తి మెరుగుపడినట్లు ఈ సర్వేలో తేలింది. 1991 జనగణన నాటి నుంచి పోల్చుకుంటే అనంతరం మూడు దశాబ్దాల కాలంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో అనేక ఒడిదొడుకులు ఉన్నాయి. 1991 గణాంకాల ప్రకారం వెయ్యి మంది పురుషులకుగానూ 927 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2005-06లో ఈ సంఖ్య సమానం కాగా, ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. లక్షద్వీప్లో లింగ నిష్పత్తి అత్యధికంగా 1187 ఉండగా, తెలంగాణలో 1049, ఆంధ్రప్రదేశ్లో 1045గా ఉంది.
రెండు విడతలుగా సర్వే
కరోనా పరిస్థితుల కారణంగా ఎన్ఎఫ్హెచ్ఎస్ 2019-21 మధ్య రెండు విడతలుగా సర్వే నిర్వహించింది. పలు రాష్ర్టాలు, యూటీలకు సంబంధించి సర్వే మొదటి విడత వివరాలను గతేడాది డిసెంబర్లో విడుదల చేసింది. మిగిలిన 11 రాష్ర్టాలు, యూటీలపై చేసిన రెండో విడతతో పాటు మొత్తంగా సర్వేలో వెల్లడైన విషయాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది. 2019-21 టీఎఫ్ఆర్ ప్రకారం దేశంలో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
తగ్గిన సంతానోత్పత్తి రేటు
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్లో కొన్నేండ్లుగా జనాభా పెరుగుదల రేటు తగ్గుముఖం పడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. దేశంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2015-16లో 2.2గా ఉండగా, 2019-21లో అది 2.0 శాతానికి తగ్గినట్టు తేలింది. దీన్ని బట్టి దేశంలో జనాభా విస్ఫోటం నెలకొన్నదనేది ఒక అపోహ మాత్రమే అని, జనాభా నియంత్రణకు ప్రభుత్వం బలవంతపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) గురువారం అభిప్రాయపడింది. సంతానోత్పత్తి రేటు తొలిసారిగా రీప్లేస్మెంట్ రేటు (2.1) కంటే దిగువకు పడిపోవడం మంచి పరిణామం అని పేర్కొన్నది. దేశంలో జనన, మరణాలను బ్యాలెన్స్ చేసే స్థాయిగా రీప్లేస్మెంట్ రేటును పేర్కొంటారు. అంటే జనాభాలో ఎలాంటి పెరుగుదల, తగ్గుదల లేకపోవడం. 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉండేది.
ఆ రాష్ర్టాల్లో ఎక్కువగానే..
బీహార్లో అత్యధికంగా 3.0 సంతానోత్పత్తి రేటు ఉండగా, సిక్కింలో తక్కువగా 1.1 ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, యూపీ, బీహార్, మణిపూర్, మేఘాలయ రాష్ర్టాల్లో మాత్రమే టీఎఫ్ఆర్ రీప్లేస్మెంట్ రేటు కంటే ఎక్కువగా ఉంది. గత ఐదేండ్ల కాలంలో బాల్య వివాహాలు కూడా తగ్గుముఖం పట్టాయని సర్వే పేర్కొన్నది. ఐదేండ్ల కిత్రం 18 ఏండ్ల లోపు వివాహం అయ్యే వారి శాతం 26.6 ఉండగా, 2019-21లో 23.3 శాతానికి తగ్గింది. ఇక కుటుంబ నియంత్రణ సాధానాలు వాడే వారి సంఖ్య పెరిగిందని పేర్కొన్నది. 15-19 ఏండ్ల మధ్య వయసు వారిలో అప్పటికే తల్లి అయిన వారు లేదా గర్భంతో ఉన్న వారి శాతం కూడా తగ్గింది.