మహిళ సంతోషంగా, భద్రంగా ఉన్న సమాజమే సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. సిరి సంపదలతో తులతూగుతుంది అనేది భారతీయుల్లో ఉన్న బలమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని తెలంగాణ సర్కారు నిజం చేసి చూపించింది. సరిగ్గా ఏడేండ్లనాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనల్లోంచి పుట్టిన ‘షీ టీమ్స్’ రాష్ట్రంలో మహిళలకు భద్రతను, గొప్ప నమ్మకాన్ని ఇస్తున్నాయి. ఆకతాయిల పీచమణిచి అత్యుత్తమ సమాజ నిర్మాణానికి బాటలు వేశాయి.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళల భద్రతకు షీ టీమ్స్ చిరునామాగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనల నుంచి 2014 అక్టోబర్ 24న పురుడుపోసుకున్న షీ టీమ్స్ మహిళలు, విద్యార్థుల్లో ఎనలేని భరోసా నింపుతున్నది. దేశంలోనే పోలీస్శాఖలో తొలిసారి ఆవిర్భవించిన ఈ విభాగానికి ఆదివారం నాటికి సరిగ్గా ఏడేండ్లు నిండాయి. మొదట హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో ఏర్పాటైన షీ టీమ్స్ ప్రస్తుతం 331 బృందాలతో 31 జిల్లాలకు విస్తరించాయి. ఈ ఏడేండ్లలో 35,699 ఆకతాయి వేధింపుల ఘటనపై విచారణ చేపట్టాయి. 3,853 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. షీ టీమ్స్ స్ఫూర్తితో తొమ్మిది రాష్ర్టాల్లో ఇలాంటి బృందాలనే ఏర్పాటుచేశారంటే సీఎం కేసీఆర్ ఆలోచన ఎంత విజయవంతమైనదో అర్థంచేసుకోవచ్చు.
అతివకు పూర్తి భద్రత
ఫిర్యాదులపై షీ టీమ్స్ చేపట్టే దర్యాప్తు ఇతర పోలీస్ విభాగాల విధానాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఫిర్యాదులు తీసుకోవడం మొదలు పరిష్కారం చూపే వరకు మొత్తం ప్రక్రియలో బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. బాధితులకు నిత్యం అండగా ఉండి ధైర్యం చెప్తారు. ఈ ఏడేండ్లలో బాధితులు ఫిర్యాదుచేసే విధానంలో కూడా ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు నేరుగా ఈ బృందాలను కలిసి ఫిర్యాదు చేయాల్సిన పనిలేదు. డయల్ 100, ఫేస్బుక్, వాట్సాప్, క్యూఆర్కోడ్ తదితర అనేక విధానాల్లోనూ ఫిర్యాదులు చేయవచ్చు. డీజీపీ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి నేతృత్వంలోని మహిళా భద్రత విభాగం రాష్ట్రస్థాయిలో మహిళా భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను పర్యవేక్షిస్తున్నది.