చెన్నై, అక్టోబర్ 16: అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ శనివారం మాజీ సీఎం జయలలిత సమాధిని సందర్శించి నివాళి అర్పించారు. అమ్మ (జయలలిత) దగ్గర తన గుండెల్లోని బరువు దించుకున్నానని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జయలలిత తమిళనాడు ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసం జీవించారని, వారు పార్టీని, కార్యకర్తలను కాపాడుతారన్న నమ్మకం తనకున్నదని చెప్పారు. అన్నా డీఎంకే 50 వ వ్యవస్థాపక దినోత్సవాలు ఆదివారం జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో జయలలితతోపాటు పార్టీ వ్యవస్థాకుడు ఎంజీఆర్, ద్రవిడ ఉద్యమ నేత అన్నాదురై సమాధుల వద్ద శశికళ నివాళి అర్పించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇది ఆమె తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నమేనని పరిశీలకులు అంటున్నారు. ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరంగా ఉంటానని శశికళ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేండ్లు జైలు శిక్ష అనుభవించిన ఈ ఏడాది మొదట్లో విడుదలయ్యారు.