న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: టెలికం ఇన్ఫ్రా సంస్థ ఇండస్ టవర్స్లో 5 శాతం వాటాను విక్రయించేందుకు బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతిపాదిత వాటాను విక్రయించేందుకు ప్రస్తుతం భారతి ఎయిర్టెల్తో చర్చలు జరుపుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 5 శాతం వాటా విలువ రూ. 3,300 కోట్లు ఉంటుందని, అమ్మకం ద్వారా వచ్చిన నిధులను భారత్లో ఉన్న జాయింట్ వెంచర్ వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడి చేయాలన్నది బ్రిటన్ సంస్థ యోచన అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇండస్ టవర్స్..వివిధ మొబైల్ ఆపరేటర్లకు అవసరమైన టెలికం టవర్లు, కమ్యూనికేషన్ స్ట్రక్చర్లను ఏర్పాటుచేసి, వాటిని నిర్వహిస్తున్నది. దేశంలోని అన్ని టెలికం సర్కిళ్లలోనూ ఇండస్ టవర్స్కు 1,84,748 టెలికం టవర్లు ఉన్నాయి. దేశంలోని అన్ని వైర్లెస్ టెలికమ్యూనికేషన్ సంస్థలకు ఇండస్ టవర్స్ సేవలు అందిస్తున్నది. బుధవారం బీఎస్ఈలో ఇండస్ టవర్స్ షేరు రూ. 251 వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం ఇండస్లో వొడాఫోన్కు ఉన్న మొత్తం 28 శాతం వాటా విలువ రూ. 19,070 కోట్లుగా ఉన్నది. భారతి ఎయిర్టెల్కు 36.7 శాతం, పబ్లిక్కు 35 శాతం చొప్పున ఇండస్ టవర్స్లో వాటా ఉంది.