హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణికుల రద్దీలో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) దేశంలో నాల్గో స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను విమాన ప్రయాణికుల సంఖ్యపరంగా దేశంలోని టాప్-10 విమానాశ్రయాల వివరాలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. నిరుడు ఏప్రిల్ మొదలు ఈ ఏడాది మార్చి ఆఖరుదాకా మొత్తం 2,50,42,482 మంది దేశ, విదేశీ ప్రయాణికులకు ఆర్జీఐఏ సేవలందించినట్టు తెలిపింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే గణనీయంగా 19.3 శాతం వృద్ధిని సాధించింది. నాటి ప్రయాణికులు 2,09,96,027 గానే ఉన్నారు. ఈసారి 40 లక్షలకుపైగా ప్యాసింజర్లు పెరిగారు. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల రద్దీలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (7,36,73,708 మంది), ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (5, 28,20,754 మంది), బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (3,75,28,533 మంది) ఉన్నాయి. ఇక బేగంపేటలోని విమానాశ్రయం నుంచి ప్రయాణించిన వీవీఐపీ ప్యాసింజర్లు 2023-24లో 8,064 మందిగా ఉన్నారు. 2022- 23లో 1,938 మంది మాత్రమే ప్రయాణించారు.